పులి మళ్లీ లేచింది
ఆటలో అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. అప్రతిహత విజయాలతో సాగిపోయాడు. ఎవరికీ సాధ్యం కాని ఘనతలు అందుకున్నాడు. ప్రపంచ క్రీడా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. వేల కోట్లు సంపాదించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కానీ అతను సంపాదించుకున్న కీర్తి మొత్తం కొన్ని రోజుల్లో తుడిచిపెట్టుకుపోయింది. అతడి తెర వెనుక బాగోతాల గురించి బయట పడగానే ఎటు చూసినా విమర్శలు, చీదరింపులు! ఈ గొడవకు తోడు గాయాల బాధతో ఆట గాడి తప్పింది. వ్యక్తిగత జీవితం దారి తప్పింది. ఆదాయం పోయింది. శిఖరం నుంచి పాతాళానికి పడ్డాడు. ఇక అతడి కథ ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లు ఇప్పుడు మళ్లీ అతడు లేచాడు. ఒక గొప్ప రికార్డు దిశగా అడుగులేస్తున్నాడు టైగర్వుడ్స్.గోల్ఫ్ అంటే టైగర్వుడ్స్.. టైగర్వుడ్స్ అంటే గోల్ఫ్! అతడి కంటే ముందు, తర్వాత గోల్ఫ్లోకి అగ్రశ్రేణి క్రీడాకారులెందరో వచ్చారు. కానీ టైగర్ లాగా ప్రభంజనం సృష్టించి.. అతడిలా గోల్ఫ్కు ప్రాచుర్యం తెచ్చిన వాళ్లు మరొకరు లేరు. గోల్ఫ్ గురించి పెద్దగా తెలియని వాళ్లు సైతం టైగర్వుడ్స్ అంటే ఒక మేటి గోల్ఫ్ క్రీడాకారుడు అనే విషయాన్ని గుర్తిస్తారు! ఈ ఆటలో అతను సాధించిన ఘనతలు, తెచ్చుకున్న పేరు అలాంటివి. 20 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ గోల్ఫర్ అయిన వుడ్స్ ఏడాది తిరక్కుండానే ప్రపంచ నంబర్వన్ అయ్యాడు. 1999 నుంచి దశాబ్దం పాటు అతడి జైత్రయాత్ర సాగింది. ఈ మధ్య కాలంలో ఏకంగా 683 వారాల పాటు ప్రపంచ నంబర్వన్గా కొనసాగిన ఘనుడు టైగర్. రికార్డు స్థాయిలో 11 సార్లు ‘పీజీఏ గోల్ఫర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. ఇంకా ఎన్నెన్నో ఘనతలు సాధించాడు. వేల కోట్లు సంపాదించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, పిల్లలతో వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా సాగిపోతుండేవాడు. అలాంటి సమయంలో వచ్చింది ఓ భారీ కుదుపు!
2009లో వుడ్స్లోని మరో కోణం బయటికి వచ్చింది. వుడ్స్ స్త్రీ లోలుడని.. అతడికి పదుల సంఖ్యలో అమ్మాయిలతో వివాహేతర సంబంధాలున్నాయని.. ఒకేసారి పలువురు మహిళలతో శృంగారం జరిపాడని మీడియాలో కథనాలు వచ్చాయి. చాలామంది అమ్మాయిలు వుడ్స్తో తమకు సంబంధం ఉందని వెల్లడించారు. ఇది పెద్ద వివాదంగా మారింది. చివరికి వుడ్స్ సైతం ఈ ఆరోపణలు నిజాలే అని అంగీకరిస్తూ తనను అభిమానించే వాళ్లందరికీ క్షమాపణలు చెప్పాడు. ఈ గొడవ కారణంగా వుడ్స్ భార్య అతడి నుంచి విడిపోయింది. ఆమెకు వేల కోట్ల రూపాయలు భరణంగా సమర్పించుకోవాల్సి వచ్చింది. వుడ్స్కు చాలా చెడ్డ పేరు రావడంతో పలు సంస్థలు అతడితో వాణిజ్య ఒప్పందాల్ని రద్దు చేసుకున్నాయి. ఈ వివాదం కారణంగా వుడ్స్ ఆట కూడా దెబ్బ తింది. అతను కొంత కాలం మైదానం వైపే రాలేదు. మళ్లీ కొన్నేళ్లకు పునరాగమనం చేసినా మునుపటి స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. ర్యాంకు 1000 దాటిపోయింది. వయసు కూడా మీద పడటంతో గోల్ఫ్లో ఇక అతడి ప్రస్థానం ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ..
ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వుడ్స్ ఆటను వదిలేయలేదు. నెమ్మదిగా విజయాలు సాధించడం మొదలుపెట్టాడు. తాజాగా ఈస్ట్ లేక్ పీజీఏ టూర్ టైటిల్ సాధించాడు. అతను ఐదేళ్ల విరామం తర్వాత టైటిల్ గెలవడం విశేషం. దీంతో అతడి పీజీఏ టైటిళ్ల సంఖ్య 80కి చేరుకుంది. నిజానికి స్నీడ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (82)ను అతనెప్పుడో దాటేయాల్సింది. ఎప్పటికైనా ఆ రికార్డు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు వుడ్స్.
తాను.. నేను రాణి రాజు
అత్యంత చిన్న వయసులో గ్రాండ్మాస్టర్గా ఎదిగిన తొలి భారత ఆటగాడు, తెలుగు రాష్ట్రాల తొలి గ్రాండ్మాస్టర్.. పెంటేల హరికృష్ణ. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత నంబర్ టూగా దేశంలో చెస్కు ఆదరణ తేవడంలో హరిది కీలకపాత్రే. కామన్వెల్త్ విజేతగా, ప్రపంచ జూనియర్, ఆసియా ఛాంపియన్గా ఎన్నో ఘనతలు సాధించిన హరి.. ఆర్నెల్ల క్రితమే ఓ ఇంటివాడయ్యాడు. సెర్బియాకు చెందిన నదెద్జాను పెళ్లాడాడు. ఒకప్పటి ఆనంద్లా విదేశాలకు మకాం మార్చిన హరి.. ఇప్పుడేం చేస్తున్నాడు? కొత్త వైవాహిక బంధం గురించి ఏం చెప్తున్నాడో తెలుసుకుందామా..!* నదెద్జాతో వివాహం తర్వాత తొలి మేజర్ టోర్నీ ఆడుతున్నారు. ఎలా సిద్ధమయ్యారు?
చెస్ ఒలింపియాడ్లో ఈసారి కచ్చితంగా పతకం తేవాలన్న లక్ష్యంతో ఉన్నాం. విశ్వనాథన్ ఆనంద్, నేను, విదిత్ సంతోష్ గుజరాతి, అధిబన్, శశికిరణ్ భారత్ తరఫున బరిలో ఉన్నాం. రేటింగ్ ప్రకారం భారత్ బలంగా ఉంది. పతకం వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఆటగాళ్ల ఫామ్ కీలకం. భారత్తో పాటు మరో ఐదారు దేశాలు బలంగా ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఉక్రెయిన్, అర్మేనియాలకు టైటిల్ గెలిచే సత్తా ఉంది. అమెరికా జట్టులో కరువానా, నకముర, సో వెస్లీ మంచి ఆటగాళ్లు. భారత మహిళల జట్టు కూడా బలంగా ఉంది. ఈసారి హంపి కూడా ఆడుతుండటంతో భారత్ స్వర్ణంపై గురిపెట్టింది. మహిళల జట్టుకు పతకావకాశాలు అధికం.
* పెళ్లి తర్వాత జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి?
పెద్దగా మార్పులేమీ లేవు. పెళ్లికి ముందు వండుకుని తినేవాడిని. ఇప్పుడు వండితే తింటున్నా. అంతే తేడా!
* హనీమూన్కు వెళ్లారా?
కేరళకు వెళ్లాం. ఐతే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాం. టోర్నీలు ఉండటంతో ప్రేగ్ (చెక్ రిపబ్లిక్)కు రావాల్సొచ్చింది. ఒలింపియాడ్ కోసం నిర్వహించిన శిక్షణ శిబిరాల కోసం భారత్కు వచ్చా. నదెద్జాకు భారత్లో ప్రదేశాలంటే చాలా ఇష్టం. కొంచెం వీలు చూసుకుని భారత్లోని ప్రముఖ ప్రదేశాలన్నీ చూడాలనుకుంటున్నాం.
* కొత్త కాపురం.. చెస్ను ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?
నదెద్జా వాళ్లది కూడా చెస్ కుటుంబమే. తను, ఆమె చెల్లి చెస్ క్రీడాకారిణులే. గంటలకొద్దీ ప్రాక్టీసులో మునిగిపోవడం.. టోర్నీలు ఆడటం వాళ్లకు అలవాటే. అందుకే మాకేమీ కొత్తగా.. ఇబ్బందిగా అనిపించట్లేదు. ప్రాక్టీసు, టోర్నీలపై ఎంత శ్రద్ధ వహించినా మాకంటూ సమయం ఉంటుంది. సరదాగా గడుపుతాం.
* మీ ఇద్దరికి కాలక్షేపం ఎలా?
ఇంట్లో ఒక కుక్క, 2 పిల్లులు ఉన్నాయి. అప్పుడప్పుడు వాటితోనే నా కాలక్షేపం (నవ్వుతూ).
* వంట ఎవరు చేస్తారు?
నాకు వంట చేయడం అస్సలు రాదు. పెళ్లికి ముందు ఎలాగోలా నడిచిపోయింది. ఇప్పుడు తనే వంట చేస్తుంది. రోజువారీ సలాడ్స్, మెడిటేరియన్ ఆహారం తయారు చేస్తుంది. భారత పండుగలు వచ్చినప్పుడు సంప్రదాయ వంటలు వండేందుకు ప్రయత్నిస్తుంది.
* నదెద్జా ఎలాంటి వంటలు చేస్తుంది?
ఆమెకు వంట చేయడమంటే ఇష్టం. ఉత్తర, దక్షిణ భారత్, మెక్సికన్ వంటకాలు వచ్చు. యూట్యూబ్లో చూసి వంటలపై పట్టు సాధిస్తోంది. అద్భుతంగా చేస్తుందని చెప్పను. కానీ బాగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రయోగాలు చేస్తుంది. భారతీయ వంటకాలు ఎక్కువ నేర్చుకుంటోంది. సమోసా, మసాలా టీ చేస్తుంది. నేను కారం తక్కువ తింటా. తను నాకంటే తక్కువ తింటుంది. నాకు బెండకాయ కూర అంటే ఇష్టం. ఇక్కడ ఎక్కువగా దొరకదు. ఎప్పుడైనా బెండకాయ దొరికితే పండుగే.
* విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోవాళ్లను ఎలా ఒప్పించారు?
మా పెళ్లి ఎలా అని మొదట్లో నాక్కూడా అనుమానాలు ఉండేవి. ఒప్పుకుంటారో లేదో అని అనుకున్నా. భిన్న సంస్కృతి, భిన్న మతం. తొందరగా ఒప్పుకోరని తెలుసు. కానీ ఒప్పించగలనన్న నమ్మకం నాకుండేది. తొలుత వద్దన్నారు. తర్వాత సరే అన్నారు. తనతో మాట్లాడిన తర్వాత అమ్మానాన్న మరింత సంతోషించారు.
* ఎప్పుడు ప్రేమలో పడ్డారు?
జూనియర్ స్థాయిలో నాతో పాటు తను కూడా ఆడేది. టోర్నీలకు వెళ్లినప్పుడు చూడటమే కానీ మాట్లాడుకోలేదు. తర్వాత తను చెస్ మానేసింది. ఒక టోర్నీలో మళ్లీ కనిపించింది. నదెద్జా చెల్లి ఆ టోర్నీలో ఆడుతుండటంతో ఆమెకు తోడుగా తను వచ్చింది. అప్పుడు మాటలు కలిశాయి. ఆ తర్వాత తరచూ మాట్లాడుకునేవాళ్లం. మా అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటవ్వడంతో పెళ్లితో కలిశాం. ప్రేమ అని చెప్పడం కంటే స్నేహితులుగా మెలిగాం.
* భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లనగానే నదెద్జా ఎలా స్పందించింది?
భారత వివాహ వ్యవస్థపై నదెద్జాకు గౌరవం ఉంది. పెళ్లి గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు చూసింది. పెళ్లిలో ఏమేం కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకుంది. స్వయంగా పెళ్లి అనుభూతుల్ని ఆస్వాదిస్తున్నప్పుడు చాలా ఆనందపడింది. కొంచెం కంగారు పడింది. మొత్తానికి బాగా ఆస్వాదించింది.
* కెరీర్ పరంగా నదెద్జా నుంచి మీకెలాంటి సహకారం లభిస్తుంది?
చెస్ క్రీడాకారిణిగా తనకు ఆటపై అవగాహన ఉంది. నా కోసం స్టడీ మెటీరియల్ సిద్ధం చేస్తుంది. చెస్24 వెబ్సైట్లో లైవ్ మ్యాచ్లు అవుతుంటాయి. నాకు అన్ని మ్యాచ్లు చూడటం కుదరదు. తను అన్నీ చూసి.. కొన్ని పాయింట్లు రాసుకుంటుంది. ముఖ్యమైనవి నాకు చెప్తుంది. టోర్నీలు, క్రీడాకారులకు సంబంధించిన సమాచారం ఇస్తుంది. గేమ్ల సమయంలో తన చిట్కాలు ఉపయోగపడుతుంటాయి.
* ఇప్పుడు నదెద్జా ఏం చేస్తోంది?
ఫిడె ఆర్బిటర్గా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ ఆర్బిటర్ అవడం తన లక్ష్యం. మరో 2 టోర్నీలు ఫిడె ఆర్బిటర్గా పనిచేస్తే అంతర్జాతీయ హోదా వస్తుంది. 2019లో తనను అంతర్జాతీయ ఆర్బిటర్గా చూడొచ్చు.
* భార్య ఆర్బిటర్.. భర్త క్రీడాకారుడిగా బరిలో దిగితే ఎలా ఉంటుంది?
నేనాడే టోర్నీల్లో అధికారిగా వ్యవహరించాలంటే అంతర్జాతీయ ఆర్బిటర్ అయ్యుండాలి. కొన్ని చోట్ల ఫిడె ఆర్బిటర్ కూడా ఉంటారు. ఇప్పటి వరకు తను ఆర్బిటర్గా, నేను క్రీడాకారుడిగా ఒకే టోర్నీలో బరిలో దిగలేదు. ఆ రోజు వచ్చినా భిన్నంగా అనిపించకపోవచ్చు. చెస్ ప్రొఫెషనల్ క్రీడ. మేధో సంబంధిత ఆట. ఫుట్బాల్, రగ్బీ మాదిరి శారీరక శ్రమ ఉండదు. చెస్లో ఆర్బిటర్ పని కూడా తక్కువే. ఎప్పుడో ఒకసారి క్రీడాకారుడు తన నిరసన తెలుపుతాడు. అంతే. అప్పటికీ నిబంధనల ప్రకారమే ఆర్బిటర్ నడుచుకోవాలి. సొంత నిర్ణయాలు ఉండవు.
* పెళ్లి తర్వాత మీ ఆటలో మార్పొచ్చిందా?
ఆట మెరుగైంది. టాప్-10కు చేరుకున్నా. ఇంకా పురోగతి రావాలి. రేటింగ్ పెరిగినా, తగ్గినా ప్రదర్శనలో వచ్చిన మార్పు తెలిసిపోతుంది. ఆట మెరుగైందో లేదో అర్థమవుతుంది. రేటింగ్ మెరుగైనా కాకున్నా ఆటను ఆస్వాదించడం నేర్చుకున్నా. ఆడటం వరకే మన పని. ఫలితం మన చేతుల్లో ఉండదు. అత్యుత్తమంగా ఆడాలి. గెలుపు కోసమే ప్రయత్నించాలి. ఇప్పుడు నా ఆటలో మరింత పరిణతి కనిపిస్తోంది. అన్నింటినీ సానుకూలంగా తీసుకుంటున్నా.
* వివాహానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు చిరాగ్గా అనిపించేదా?
ఓటమి ఎప్పుడైనా బాధాకరమే. పెళ్లికానప్పుడు ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. రాత్రి పడుకునే ముందు గేమ్కు సంబంధించిన ఆలోచనలు వస్తుండేవి. అలా ఆడివుంటే బాగుండేది.. ఇలా ఆడకుండా ఉండాల్సిందన్న ఆలోచనలు మెదులుతాయి. ఆ కారణంగా ఉదయం ఉత్సాహంగా అనిపించదు. ఇప్పుడు అలా లేదు. చాలా ఆనందంగా ఉన్నా. ఓడినా పెద్దగా బాధపడటం లేదు.
* మీ ఇద్దరిలో ఎక్కువ ప్రభావవంతమైన వ్యక్తి?
మా ఇద్దరిలో తనే ఎక్కువ ప్రభావవంతమైన వ్యక్తి. నా కెరీర్, జీవితంలో ఆమె నిర్ణయాలు కీలకం. ఎంత శాతం అని చెప్పను. పరిస్థితులకు తగ్గట్లు శాతం మారుతూ ఉంటుంది. నా ప్రయాణాలు, టోర్నీలు తనే చూసుకుంటుంది.
* హైదరాబాద్ను నదెద్జా ఎలా ఆస్వాదించింది?
హైదరాబాద్లో 20 రోజులు ఉంది. గోల్కొండ కోటకు వెళ్లాం. బిర్లా మందిర్, ఫిల్మ్నగర్ దైవ సన్నిధానం చూశాం. శిల్పారామం తనకు బాగా నచ్చింది. భిన్నమైన కళలు తనని ఆకట్టుకున్నాయి. గోల్కొండ కోట కూడా తనలో ఆసక్తి రేకెత్తించింది.
పెళ్లి తర్వాత ఆట మెరుగైంది. ఆటను ఆస్వాదించడం నేర్చుకున్నా. ఇప్పుడు నా ఆటలో పరిణతి కనిపిస్తోంది. అన్నింటినీ సానుకూలంగా తీసుకుంటున్నా. ర్యాంకింగ్స్లో టాప్-10కు చేరుకున్నా. ఇంకా పురోగతి రావాలి. |
నదెద్జాకు ఇంకా తెలుగు పూర్తిగా రాదు. కొన్ని పదాలు అర్థమవుతాయి. కొంచెం కొంచెం మాట్లాడుతుంది. కొద్ది కాలంలోనే తెలుగు పూర్తిగా నేర్చుకుంటుంది. |
చదరంగంలో మా పాత్రలు..
చెస్ బోర్డులో తన స్థానమేంటో చెప్పడం కష్టం. వెనకాల ఉండి పనిచేయడమంటే తనకు ఇష్టం. బహుశా రాణి అనుకోవచ్చు. నిశ్శబ్ధంగా ఉంటూ తన పని తను చేసుకుపోతుంది. నేను రాజు మాదిరి. ఎక్కువ తిరగలేపోయినా అత్యంత కీలకం. సందర్భానికి తగ్గట్లు మేమిద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం. ఆర్థిక పరమైన నిర్ణయాలన్నీ తనే చూసుకుంటుంది. నిర్వహణ, ప్రణాళిక, ఏర్పాట్ల విషయంలో తను నాకంటే మెరుగు. రాణి వేగంగా కదులుతుంది. రాజు మెల్లిగా వెళ్తాడు. అందుకే ఇద్దరి మధ్య సమన్వయం కుదిరింది. కింగ్, క్వీన్లలో ఎవరి అనుకూలతలు వారికి ఉంటాయి. |
ఆటలే కాదు గొడవలూ..
చిన్న చిన్న గొడవలు సహజం. కానీ పోట్లాడుకోం. ఎక్కువసేపు వాదించుకోం. ఏవైనా పొరపాట్లు ఉంటే సర్దుకుంటాం. పొరపాట్లంటే.. మొక్కలకు నీళ్లు పోయడం మరిచిపోవడం, కుక్కను బయటికి తీసుకెళ్లకపోవడం వంటివి. చాలా చిన్న విషయాలు. వెంటనే సర్దుకుని నవ్వుకుంటాం. ఇద్దరం చెస్ క్రీడాకారులమే కాబట్టి కాసేపు నిశ్శబ్ధంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయని తెలుసు. – వరికుప్పల రమేశ్
|
ఆదర్శం.. ఈ యువ దంపతులు
దూరం తగ్గింది!
జిమ్కార్బెట్ నేషనల్ పార్క్… ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎంతో పేరున్న పర్యాటక ప్రదేశం. టైగర్ రిజర్వ్గా ఎంతో ప్రసిద్ధి. స్థానికులకు ఓ ఆటవిడుపు. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఎంతో మంది వీకెండ్స్లో ఈ ట్రిప్లకు వెళ్లడం పరిపాటి. అంతేకాదు ఈ జాతీయ పార్క్ చుట్టూ వెలసిన రిసార్టులు ఉండడంతో డెస్టినేషన్ వెడ్డింగ్స్కు కాబోయే వధూవరులు క్యూ కడుతున్నారు కూడా. మరి పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ జాతీయ పార్కుకు వెళ్లాంటే ఒకటే దారి ఉంది. అదీ ఢిల్లీ నుంచి రామ్నగర్ మీదుగా ప్రయాణించాలి. ఈ దూరం 240 కి.మీ. ఇంచుమించు అయిదు గంటల సమయం పడుతుంది. త్వరలోనే ఇంకో మార్గం ఏర్పాటు కానుంది. ఈ పార్కులో సఫారీ చేయాలనుకునేవారికి కోట్ద్వార్ అనే పల్లె సమీపంలోని పఖారో అనే ద్వారం ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. దీని ద్వారా సుమారు 80 కి.మీ దూరం తగ్గిందని అంచనా. త్వరలోనే ఈ కొత్త రూట్ సందర్శకులకు అందుబాటులోకి రానుంది.
క్రూయిజ్లో ఖుషీగా…
పర్యాటకులకోసం విమానాల్లో, రైలు, రోడ్డు మార్గాల్లో దేశ, విదేశాల్లోని చార్రితక, దర్శనీయ స్థలాలకు ప్యాకేజీలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అందిస్తోంది. ఇప్పుడు తొలిసారిగా క్రూయిజ్ (నౌక) యాత్ర లకు శ్రీకారం చుట్టింది. విలాసవంతమైన నౌకలో, ఆహ్లాదకర వాతావరణంలో
పర్యటనలకు ఏర్పాట్లు చేస్తోంది. వివరాలు ఇవిగో…
ఎప్పుడు?: ఈ ఏడాది జూన్ 24 నుంచి జులై 7 వరకూ
యాత్ర వివరాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన పర్యాటకులు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలి. తర్వాత టూర్ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. జూన్ 24న ఢిల్లీ నుంచి దుబాయ్కీ, అక్కడి నుంచి కోపెన్హెగెన్కు విమానంలో ప్రయాణం… 25వ తేదీ ఉదయం కోపెన్హెగెన్ పోర్టు నుంచి క్రూయిజ్ యాత్ర మొదలవుతుంది. జర్మనీ, పోలండ్, ఫిన్లాండ్, రష్యా, స్పెయిన్, స్వీడన్ దేశాల మీదుగా సాగుతుంది. ఆ దేశాల్లోని వివిధ నగరాలలో సైట్ సీయింగ్ ఉంటుంది. జూలై 4న తిరిగి కోపెన్హెగెన్లో క్రూయిజ్ ప్రయాణం ముగుస్తుంది. అక్కడినుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా హైదరాబాద్ రావడంతో టూర్ పూర్తవుతుంది.
ఇవీ సౌకర్యాలు: ఈ పర్యటన నార్వేజియన్ గేట్వే అనే నౌకలో సాగుతుంది.
దానిలో మొత్తం 30 బాల ్కనీలు ఉంటాయి. వాటిలోంచీ సముద్రాన్ని వీక్షిస్తూ ప్రయాణం చేయవచ్చు. నౌకలో రెండు ప్రధాన డైనింగ్ హాళ్లు, స్విమ్మింగ్ పూల్, బార్ అండ్ రెస్టారెంట్, కాఫీ బార్, ఫిట్నెస్ సెంటర్, ఇంటర్నెట్, వైఫై, స్పా, సెలూన్ సర్వీసులు, డైనింగ్ ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు ఉంటాయి. పర్యాటకులు తమకు నచ్చిన సినిమాలను చూడొచ్చు. కోపెన్హెగెన్లో త్రీస్టార్ హోటల్లో, ఢిల్లీలో వసతి కల్పిస్తారు.
టికెట్ ధరలు..
ఫిబ్రవరి 28 లోగా బుకింగ్ చేసుకుంటే…
ఒక్కొక్కరికి: రూ.4,83,630 ఫ ఇద్దరు కలిపి బుక్ చేసుకుంటే (ఒక్కొక్కరికి): రూ. 2,95,817 ముగ్గురు కలిసి బుక్ చేసుకుంటే (ఒక్కొక్కరికి) రూ. 2,63,634
పిల్లలకు (బెడ్తో- ఒక్కరికి): రూ.2,43,516 – (బెడ్ లేకుండా- ఒక్కరికి): రూ.1,87,719 0-2 మధ్య వయసు పిల్లలకు (ఒక్కరికి): రూ.27,258 మార్చి 1 నుంచి 22 వరకు బుకింగ్ చేసుకుంటే…
ఒక్కరికి: రూ.5,80,356 ఫ ఇందులో ఇద్దరు కలిసి బుక్ చేసుకుంటే (ఒక్కొక్కరికి): రూ.3,54,974 ఫ ముగ్గురు కలిసి బుక్ చేసుకుంటే (ఒక్కొక్కరికి): రూ.3,16,365 పిల్లలకు (బెడ్తో- ఒక్కరికి): రూ.2,92,215- (బెడ్ లేకుండా- ఒక్కరికి): రూ.2,25,267 0-2 మధ్య వయసు పిల్లలకు (ఒక్కరికి): రూ.32,708
ఎన్ని విశేషాలో.. ఈ వంతెనలో.. !
ఈ వంతెన పేరు యావుజ్ సుల్తాన్ సెలిం బ్రిడ్జ్. ఒట్టోమాన్ను పాలించిన రాజు యావుజ్ సుల్తాన్ సెలిం జ్ఞాపకార్థం ఆయన పేరు ఈ వంతెనకు పెట్టారు. ఈ వంతెన నిర్మాణం వల్ల ఇస్తాంబుల్లో ట్రాఫిక్ కష్టాలు చాలా తగ్గాయి.
యూరప్, ఆసియాలను కలుపుతున్న వంతెన ఇది. బాస్పోరస్ అనే జలసంధిపై నిర్మించారు.ప్రపంచంలో వెడల్పయిన సస్పెన్షన్ బ్రిడ్జ్గా దీనికి గుర్తింపు ఉంది. ఈ వంతెనకు డిజైన్ రూపొందించింది ఫ్రాన్స్కు చెందిన మైఖెల్ విర్లోజెక్స్ అనే ఇంజనీర్.
ఒక దిశలో మోటారు వాహనాల కోసం నాలుగు లైన్లుంటాయి. ఒక రైల్వే లైను ఉంటుంది. అంటే రెండు దిశలలో కలుపుకుంటే ఎనిమిది వరుసల రహదారి, మధ్యలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి. సస్పెన్షన్ బ్రిడ్జ్పై రైల్వే లైన్లు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి వంతెన ఇదే.
రెండు స్తంభాల మధ్య దూరం 4600 అడుగులు ఉంటుంది. రెండు స్తంభాలను కలుపుతూ తీగలుంటాయు. ఆ తీగలపై వంతెన వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 2.1 కి.మీ. వేలమంది కార్మికులు రెండేళ్లు శ్రమించి ఈ వంతెన నిర్మించారు.
ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే..?
ఆంజనేయుడు సీతారాములవారికి ప్రియమైన భక్తుడు. అలాంటి స్వామివారిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. హనుమంతునికి తమలపాకుల పూజ చేసేందుకు ఓ కారణం ఉంది. అందేటంటే.. ఓసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరామునిని స్వామీ ఏమిటది..? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది..? అని అడిగారు.
అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుండి వెళ్లి కాసేపటికి శరీరమంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు.
హనుమంతుడు రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో స్వామివారిని పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి.
హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి బాగా ఎదుగుతారు. అలానే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి పండ్లు, తమలపాకులు దక్షిణ భాగంలో దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది.
శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేయిస్తే..?
శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశ వ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు.
ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన “పుత్ర కామేష్టి యాగ” ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
తూర్పు ముఖంగా పూజ గది ఉంటే….?
ఇంట్లోని పూజగది తూర్పు ముఖంగా ఉంటే.. పూజలు ఎలా చేయాలి.. దాదాపు తూర్పు ముఖంగా ఉన్నవే మనదేశంలో దేవాలయాలు. అందులో ఎన్నో ఆలయాలు నాలుగు గంటలకు నైవేద్యార్చనలు పొందుతున్నాయి. పూజ బ్రహ్మ ముహూర్తంలో అన్నది నియమం. అది ఆలయ ముఖం బట్టి కాదు. పడమర ముఖం పూజగదిలో పగలు పన్నెండు గంటలకైనా పూజ చేయవచ్చు అనేది లేదు.
మనిషి మేలుకొలుపు అన్నది ప్రధానం. మేలుకొలుపు అనేది భౌతిక శరీరం నిద్రలేవడం అనేదానిని సూచించేది కాదు భ్రమల నేత్రం మూసుకుని జ్ఞాననేత్రం తెరుచుకోవాలని సూచిస్తుంది. అద్భుత ప్రతిభ ఎక్కడో కొండకోనల్లో, పాతాళంలో పాతుకుని ఉండదు.
మన పాంచభౌతిక శరీరంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ప్రకృతిలోని బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రసారమయ్యే నిగూఢ శక్తి విన్యాసంతో మన మేధ మహాన్నత స్థితిని అందుకుంటుంది. ఆ వేళ మనిషిని మేలు కొలుపుతుంది.
మహిళలందరికీ అయ్యప్ప దర్శనం… సమ్మతించిన దేవస్థాన బోర్డు
మూడు పసిడి కిరీటాలు ఏమయ్యాయ్?
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం కాసుల వర్షం కురుస్తూనే వుంటుంది. వెంకన్నకు భారీగా విరాళాలు, కానుకలు వచ్చి చేరుతుంటాయి. తిరుమల ఆలయంలోని వెంకన్నకు పసిడి కిరీటాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో తితిదే ఆధ్వర్యంలోని గోవింద స్వామి ఆలయంలో మూడు కిరీటాలు కనిపించట్లేదని.. అదృశ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. గోవింద స్వామి ఆలయంలోని మూల విరాట్కు అలంకరించే మూడు కిరీటాలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
దీనిపై ఆలయ పూజారులు.. ఆలయ నిర్వాహకుల వద్ద విషయాన్ని తెలియజేశారని.. బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా గోవింద స్వామి కిరీటాలు చోరీకి గురయ్యాయని ఇందుకోసం ప్రత్యేక బృందం బరిలోకి దిగి దర్యాప్తు మొదలెట్టిందని సమాచారం.
శనివారం సాయంత్రం పూజలు పూర్తయ్యాక నైవేద్యం సమర్పించారని.. తర్వాత ఆలయాన్ని మూతవేశారు. తిరిగి పూజ కోసం ఆలయాన్ని తెరిస్తే.. గోవింద స్వామి పసిడి కిరీటాలు అదృశ్యమయ్యాయని తెలిసింది. ఇవి 528 గ్రాములతో కూడిన రెండు కిరీటాలు, 408 గ్రాములతో కూడిన ఓ కిరీటం మాయమైందని.. శ్రీదేవి, భూదేవి, గోవింద స్వామికి ధరించే మూడు కిరీటాలను కాజేశారని ప్రత్యేక బృందం వెల్లడించింది. దీనిపై ఆలయ అధికారులు, పూజారులు, ఉద్యోగుల వద్ద విచారణ జరుపుతున్నట్లు దర్యాప్తు బృందం తెలిపింది
వైఫై సంకేతాలతోనే స్మార్ట్ఫోన్ ఛార్జింగ్
మీ స్మార్ట్ఫోన్ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్తోనే చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ! కానీ రెక్టెన్నా అనే ప్రత్యేకమైన పరికరం సాయంతో ఇది చాలా సులువైన పనే అని అంటున్నారు టోమ్స్ పలాసియోస్ అనే శాస్త్రవేత్త. ఏసీ విద్యుత్తు ద్వారా పుట్టే విద్యుదయస్కాంత తరంగాలను డీసీ తరంగాలుగా మార్చే పరికరమే రెక్టెన్నా. ఎంఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్తరకం రెక్టెన్నా మాత్రం రేడియో తరంగాలను స్వీకరించి ఏసీ విద్యుత్తరంగాలుగా మారుస్తుందన్నమాట. అయితే ఇప్పటివరకూ రెక్టెన్నాతో ఉత్పత్తి చేయగలిగిన విద్యుత్తు చాలా తక్కువగా ఉండటంతో ఈ రెక్టెన్నాను విçస్త్రత స్థాయిలో వాడటం సాధ్యం కాలేదని తమ గాడ్జెట్తో ఈ పరిస్థితి మారిపోతుందని టోమ్స్ తెలిపారు.
నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ కొత్తతరం రెక్టెన్నాను చాలా చౌకగా, సులువుగా తయారు చేయవచ్చు. హైవేల వెంబడి కొత్త రెక్టెన్నాలను భారీ సైజులో ఏర్పాటు చేయవచ్చునని తద్వారా బ్యాటరీల అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అన్నింటినీ చార్జ్ చేయవచ్చునని తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము తయారుచేసిన రెక్టెన్నాలతో 40 మైక్రోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగామని.. ఎల్ఈడీ స్క్రీన్లు మొదలుకొని అనేక వేరబుల్ గాడ్జెట్స్కు ఈ మాత్రం విద్యుత్తు సరిపోతుందని వివరించారు.
సంతాన ప్రాప్తికి ఏం చేయాలంటే…
కన్యాదానం… కాదు సమంజసం
కలకత్తా నగరంలో నందిని భౌమిక్ పౌరోహిత్యం నిర్వహిస్తున్నారు. సాధారణంగా పౌరహిత్యం మగవారి చేతుల్లో ఉంటుంది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం తక్కువ. కాని నందిని భౌమిక్ పట్టుదలగా ఈ రంగంలోకి వచ్చారు. వృత్తిరీత్యా జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖ అధ్యాపకురాలుగా పని చేస్తున్న భౌమిక్ తనలాంటి భావాలు కలిగిన ఇద్దరు ముగ్గురు స్త్రీలతో కలిసి ఒక బృందంగా ఏర్పాటయ్యారు. రుమా రాయ్, సీమంతి బెనర్జీ, పైలమీ చక్రవర్తి… అనే ఈ ముగ్గురితో కలిసి నందిని నిర్వహించే పౌరహిత్య కార్యక్రమాలు ఫేమస్ అయ్యాయి. ఇటీవల ఈమె నిర్వహించిన ఒక వివాహం కూడా వార్తలకు ఎక్కింది.
కలకత్తాకు చెందిన అన్వితా జనార్దన్, అర్కా భట్టాచార్య ఫిబ్రవరి 24న వివాహం చేసుకున్నారు. నందిని పౌరోహిత్యం వహించారు. వరుడు భట్టాచార్యకు నందిని బృందమంటే అపారమైన గౌరవం. వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. తన పెళ్లి జరిపించమని కోరాడు. పెళ్లి జరిపిస్తున్న నందిని సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాలకు ఆంగ్ల, బెంగాలీ భాషలలో అర్థవివరణ ఇవ్వడం ఆహూతులను ఆకర్షించింది. అయితే ఈ పెళ్లిలో ‘కన్యాదానం’ తంతును తాను నిర్వహించబోవడం లేదని నందిని ప్రకటించి అందరినీ ఆలోచనలో పడేశారు. పురాతన హిందూ గ్రంథాలలో కన్యాదానం లేకుండానే వివాహ క్రతువు నడిచేదని ముఖ్యంగా ఋగ్వేదం ఈ విషయం రూఢీ పరిచిందని ఆమె తెలిపారు. స్త్రీ వస్తువు కాదని ఇంత ఆధునిక సమాజంలో ఆమెను దానంగా ఇవ్వడం, దానంగా తీసుకోవడం వెనుకబాటుతనానికి చిహ్నం అని చెప్పారు.
వధువరులు నందిని మాటలకు సమ్మతించి కన్యాదానం తంతు లేకుండానే వివాహం చేసుకోవడం వార్తగా మారింది. స్త్రీలు పౌరహిత్యం చేయడం ఏమిటని కలకత్తాలో కొంతమంది నొసలు చిట్లించినా ఆడవారు పౌరోహిత్యం వహించడం దోషం కాదని మరికొందరు పండితులు సమర్థన తెలిపారు. మహిళల పౌరోహిత్యం గురించి వేదాలలో చాలా పెద్ద వేదాంత చర్చ జరిగిందని కూడా వారు తెలియచేశారు. మొత్తానికి నందిని బృందం స్త్రీల తరఫున ఆలోచిస్తూ స్త్రీలకు అపసవ్యమైన తంతులను పరిహరిస్తూ శుభకార్యాలు నిర్వర్తించడం అందరినీ ఆకర్షిస్తోంది.
మంగళసూత్రం ధరించడం ఫ్యాషన్ కాదు.. స్త్రీ ఆరోగ్యానికి మేలు
2.ఓ టీజర్: చిట్టి మళ్లీ అదరగొట్టాడు
2.ఓ టీజర్: చిట్టి మళ్లీ అదరగొట్టాడు

తలైవా అభిమానులకు వినాయక చవితి కానుకగా 2. ఓటీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్- సూపర్ స్టార్ రజనీ కాంత్ల కాంబినేషన్లో వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీ రోబో. ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిస్తున్న భారీ విజువల్ వండర్ చిత్రం 2.ఓ. రజనీ సరసన అమీజాక్సన్ జతకట్టగా.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
భారత దేశంలో 75 మిలియన్ డాలర్ల(సుమారు 545 కోట్లు) బడ్జెట్తో తెరకెక్కిన తొలి విఎఫ్ఎక్స్ వండర్ అంటూ చిత్ర బృందం ప్రచారం చేసింది. వారు పేర్కొన్న విధంగానే గురువారం రీలీజ్ అయిన టీజర్ చూస్తే సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకోక తప్పదు. అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ టీజర్లో కనిపిస్తున్నాయి. రజనీ మరోసారి సైంటిస్ట్ అవతారం ఎత్తి చిట్టి (రోబో) రూపంలో అన్ని సమస్యలు తీర్చనున్నాడు. ఈ టీజర్లో శంకర్ తన మార్క్ చూపించాడు. అక్షయ్కుమార్ బయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ టీజర్లోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. నవంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
చూసొద్దాం హిమాలయాల్లో కుంభమేళా
సెప్టెంబరు వచ్చిందంటే లేహ్ దారిలో పండగ వాతావరణం కనిపిస్తుంది. దేశవిదేశాల నుంచి బౌద్ధులు, భిక్షువులు ఇక్కడికి తరలివస్తారు. వందల్లో.. వేలల్లో.. లక్షల్లో వస్తారు. అంతా లేహ్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హెమిస్ బౌద్ధ ఆరామానికి చేరుకుంటారు. బౌద్ధ సంప్రదాయానికి, ఇండో-టిబెట్ సంస్కృతికి అద్దం పట్టే నారొపా ఉత్సవాల్లో పాలుపంచుకుంటారు. లక్షల మంది బౌద్ధులను ఏకం చేసే నారొపా వేడుకను హిమాలయా కుంభమేళాగా అభివర్ణిస్తారు. 11వ శతాబ్దానికి చెందిన బౌద్ధ భిక్షువు నారొపా ఆరాధనోత్సవాలుగా వీటిని అభివర్ణిస్తారు. ఏటా ఐదురోజుల పాటు సాగే ఈ వేడుకను.. పన్నెండేళ్లకోసారి మరింత ప్రత్యేకంగా నిర్వహిస్తారు. 2016లో పుష్కర సంబరం కాగా, ప్రతి ఏడాదిలాగే ఈసారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆటలు, సంప్రదాయ నృత్యాలు, వాద్యాల హోరు, కచేరీలు, సాహస క్రీడలకు వేదికగా నిలవనుంది. రకరకాల ముసుగులతో కళాకారులు ప్రదర్శించే నాట్యవిన్యాసాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తారు.
ఎప్పుడు: సెప్టెంబర్ 16 నుంచి 20 వరకు
ఎక్కడ: హెమిస్ ఆరామం (లేహ్ నుంచి 40 కి.మీ)
ఎలా వెళ్లాలి:
* లేహ్ వెళ్లాలంటే ముందుగా దిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి విమానంలో లేహ్కు నాన్స్టాప్ విమాన సర్వీసులు ఉన్నాయి.
* లేహ్కు మనాలి మీదుగా కూడా చేరుకోవచ్చు. మనాలి వెళ్లాలంటే చండీగఢ్ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులో, ట్యాక్సీలో మనాలికి (305 కి.మీ) వెళ్లొచ్చు. మనాలి నుంచి బస్సులోగానీ, ట్యాక్సీలో గానీ లేహ్కు (473 కి.మీ) చేరుకోవచ్చు.
* విజయవాడ నుంచి డెహ్రాడూన్ మీదుగా చండీగఢ్కు రైలు (వీక్లీ) అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి చండీగఢ్కు నాన్స్టాప్ విమాన సర్వీసులున్నాయి.
వినాయకచవితి సెప్టెంబరు 13
విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున ఈ పండగను నిర్వహిస్తారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశేషమైన విశిష్టత వుంది. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. గణనాధుని కృప వుంటే మనకు అన్ని విజయాలే లభిస్తాయి. ఈ పర్వదిన ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. అనేకప్రాంతాల్లో గణపతి నవరాత్రులు నిర్వహిస్తారు. ప్రతి ఇంటా వినాయకుడి బొమ్మను వివిధ రకాలైన పుష్పాలు, పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు.
గణపతి నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముంబయి, పుణె, హైదరాబాద్… తదితర నగరాల్లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమంలో వేలాదిగా విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. భారతీయ సంప్రదాయంలో అన్ని వర్గాలు జరుపుకొనే పండగల్లో వినాయకచవితిది అగ్రస్థానం. గత కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహాల తయారీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. మట్టితో వినాయక విగ్రహాల తయారీతో పాటు పర్యావరణ హితమైన రంగులను వాడటం పెరిగింది. దీంతో పలు తటాకాలు, నీటి వనరులు కలుషితం కాకుండా కాపాడుకుంటున్నాం.
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్
స్టాక్హోం: 2018 సంవత్సరానికి గానూ నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది అమెరికా, జపాన్కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్ను పంచుకుంటున్నారు. జేమ్స్ పి అల్లిసన్(అమెరికా), తసుకు హోంజో(జపాన్)కు వైద్యరంగంలో నోబెల్ బహుమతి అందిస్తున్నట్లు స్టాక్హోం(స్వీడన్) లోని నోబెల్ అసెంబ్లీ ఈరోజు ప్రకటించింది.
క్యాన్సర్ చికిత్స కోసం వీరు చేసిన పరిశోధనలకు గానూ నోబెల్ బహుమతి ప్రకటించారు. క్యాన్సర్ కణాలపై పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయపడుతుందని వీరు తమ అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల(7,80,000 పౌండ్లు) నగదు బహుమతిని కూడా వీరు అందుకోనున్నారు.
వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్ బహుమతి అందిస్తారు. వీటితో పాటు శాంతి బహుమతి కూడా ఇస్తారు. అయితే కొన్ని లైంగిక ఆరోపణల కారణాల వల్ల ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ ఇవ్వట్లేదు. భౌతిక శాస్త్రంలో మంగళవారం, రసాయన శాస్త్రంలో బుధవారం పురస్కారాలు ప్రకటించనున్నారు. అక్టోబరు 5 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాల విజేతలను వెల్లడిస్తారు
హైదరాబాద్లో ఆగస్టు 25న మాలతీ చందూర్ పురస్కార ప్రదానోత్సవం
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి(చెన్నై), చందూర్ కుటుంబం, స్నేహితుల సంయుక్త ఆధ్వర్యంలో ‘శ్రీమతి మాలతీ చందూర్ పురస్కార ప్రధానోత్సవం’ జరుగనుంది. ఆగస్టు 25న శనివారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారకరామారావు కళామండపంలో జరగనున్న ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి, తెలంగాణ సాంస్కృతిక మీడియా వ్యవహారాల సలహాదారు కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి మాలతీ చందూర్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు ఆచార్య ముదిగంటి సుజితారెడ్డి, ప్రముఖ రచయిత, సినీ గేయకర్త భువనచంద్ర.. తదితరులు ఈ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొననున్నారు.
స్వర్ణంతో తిరిగొస్తానని..నా గురువుకి మాటిచ్చా
జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో స్వర్ణంతో తిరిగి వస్తానని తన గురువుకు ఇచ్చిన మాటను నిలబెట్టకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు భారత రెజ్లర్ పునియా. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో భజరంగ్ 11-8తో టకాటని డైచి(జపాన్)ని ఓడించి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఒకే ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల స్వర్ణాలు గెలిచిన యోగేశ్వర్ దత్, రాజిందర్సింగ్ సరసన చేరాడు పునియా.
ఈ సందర్భంగా పునియా మాట్లాడుతూ…‘ఆసియా క్రీడల్లో స్వర్ణంతో తిరిగి వస్తానని నా గురువు యోగేశ్వర్ దత్కు మాటిచ్చాను. ఇప్పుడు నా మాట నిలబెట్టుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. 2014 ఆసియా క్రీడల్లో యోగేశ్వర్ బంగారు పతకం సాధించాడు. నా కెరీర్లో అతని ప్రభావం ఎంతో ఉంది. ఇదే ప్రదర్శన నేను భవిష్యత్తుల్లోనూ కొనసాగిస్తే ఒలింపిక్స్లో పతకం గెలవడం ఖాయం. ప్రస్తుతం నా దృష్టంతా ప్రపంచ ఛాంపియన్షిప్ పైనే’ అని పునియా చెప్పాడు. అనంతరం సుశీల్ పరాజయం గురించి మాట్లాడుతూ… ‘సుశీల్ కుమార్ దిగ్గజ ఆటగాడు. అతడు బరిలో ఉన్నాడంటే చాలు బంగారు పతకం ఆశించవచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ అతడు తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. సుశీల్ ఓడిపోవడంతో నాతో పాటు మిగతా రెజ్లర్లు కూడా బాధపడ్డారు’ అని పునియా తెలిపాడు.
తాను బంగారు పతకాన్ని అందుకున్న ఫొటోను పునియా ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ఆసియా క్రీడల్లో బంగారు పతకం. ఈ బంగారు పతకాన్ని మాజీ ప్రధాని, దివంగత వాజ్పేయీకి అంకితమిస్తున్నా’ అని పునియా ట్విటర్లో పేర్కొన్నాడు.
ఆమె ఆలోచన… ఆకలి తీర్చాలని..!
సొంతూరు బాపట్ల అయినా హైదరాబాద్లో స్థిరపడిన కుటుంబం మాది. నాన్న ఆర్పీఎఫ్లో సీఐగా పనిచేసి రిటైరయ్యారు. ఇంట్లో పెద్దదాన్ని నేనే. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి 2001లో ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ పూర్తిచేశాను. మీడియా రంగం మీద ఆసక్తితో హైదరాబాద్ దూరదర్శన్లో ‘ప్రభాత దర్శిని’ కార్యక్రమ నిర్వహకురాలిగా, దూరదర్శన్ ఢిల్లీ ఎడిషన్లో కూడా పనిచేశా. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంగ్లీష్ పాఠాలు, టోఫెల్ క్లాసులు చేప్పేదాన్ని. అలా పదేళ్లు బిజీగా గడిచిపోయాయి. 2011లో సౌదీ అరేబియాలోని ‘దమామ్ యూనివర్సిటీ’లో ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్గా అవకాశం వచ్చింది. ఆరేళ్లు అసలు విశ్రాంతనేదే లేకుండా పనిచేశా. 2016లో ఒక న్యూస్ చానల్లో క్రియేటివ్ హెడ్గా అవకాశం వచ్చింది. స్వశక్తితో ఎదిగిన అనాథ అమ్మాయిల జీవితాల్ని ఆవిష్కరించిన ‘నగిషీ’ ప్రొగ్రామ్ నాకు బాగా పేరు తెచ్చింది. అయితే ఎన్నేళ్లు ఇలా ఉద్యోగం చేస్తూ, నా కోసం నేను బతకడం… సమాజం కోసం ఏం చేయలేకపోయాననే అసంతృప్తి నన్ను వేధిస్తూ ఉండేది.
ఎన్జీవో ఆలోచన…
హైదరాబాద్ నాకు అనేక ఉద్యోగావకాశాలిచ్చింది. నాకంటూ ఒక జీవితాన్నిచ్చింది. అందుకే ఈ నగరం కోసం ఏదైనా చేయాలనిపించేది. నేను ‘గివ్ బ్యాక్ టు సొసైటీ’ కాన్సెప్టును బలంగా నమ్ముతా. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి సేవాకార్యక్రమాలు చేయాలనుకునేదాన్ని. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలనే ఆలోచన అప్పుడే తట్టింది. అందులోని తృప్తి దేనిలోనూ ఉండదు. హైదరాబాద్లో ఆస్పత్రులు, పార్కులు, పబ్లిక్ స్థలాల వద్ద పట్టెడన్నం కోసం ఆబగా ఎదురుచూసే వాళ్లను ఎంతోమందిని చూశాను. ఫేస్బుక్లో ఒక వీడియోలో చిన్న పిల్ల దోసెడు మెతుకుల కోసం పడిన తపన నన్ను బాగా కలిచివేసింది. గత ఏడాది ఫిబ్రవరి చివర్లో ‘ఆపిల్ హోమ్స్’ ఆర్గనైజేషన్ను రిజష్టర్ చేశా. ఈ పేరు పెట్టడానికి కారణం… నా కూతురు పేరు ఆపిల్. లోగోలో పచ్చ ఆపిల్ ఉంటుంది. ఇది హెల్తీనెస్ను సూచిస్తుంది. ఆర్గనైజేషన్లో అయిదు విభాగాలున్నాయి. వాటిలో మొదటిది ‘ఫీడ్ ద నీడ్’.
విభిన్నంగా చేయాలనే…
కేరళ, శ్రీకాకుళం వరదల సమయంలో ఆర్గనైజేషన్ తరపున సేవలందించాం. కానీ అలా సాయం చేయడానికి చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వాటికి భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నా. పెళ్లిళ్లలో, హోటళ్ళలో చాలా ఆహారం వృథా అవుతుంది. అంత మంచి ఫుడ్ను ఎందుకు పడేయాలి? అప్పుడే ఫ్రీజర్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. పూర్తిగా ఆర్గనైజేషన్ పనులు చూసేందుకు గత నవంబర్లో ఉద్యోగానికి రాజీనామా చేశా. ‘మంచి జీతం వదులుకొని పబ్లిక్ ప్లేసెస్లో ఫ్రిజ్ పెడతానంటావ్?’ అని చాలామంది ఎగతాళి చేశారు. అయితే వారి మాటలేవి పట్టించుకోకుండా నా లక్ష్యం వైపు కదిలాను. అప్పటికే చెన్నై, బెంగళూరులో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫ్రిజ్ ప్రాజెక్టు గురించి చదివాను.
అయితే వాటి నిర్వహణలోపం, వాటిలో కలుషిత ఆహారం ఉంచడం, కమ్యూనిటీ వాళ్లు ఏర్పాటుచేయడం వల్ల విజయవంతం కాలేదని తెలుసుకున్నా. ఆర్నెళ్లపాటు రీసెర్చ్ చేశా. అక్కడ విఫలమవడానికి ప్రభుత్వ సహకారం లేకపోవడం అని అర్థమైంది. నేను ఆ పొరపాటు చేయకూడదనుకున్నా. రెండునెలలు హైదరాబాద్ అంతా తిరిగి పబ్లిక్ ఫ్రిజ్ ఉంచేందుకు అనువైన 100 ప్రదేశాలను గుర్తించాను. ఒక్కో రోజు ఉదయం 6 గంటలకు వెళ్లి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరేదాన్ని. రెస్టారెంట్, హోటల్ యజమానులను కలిపి నా ప్రాజెక్టు వివరించేదాన్ని. ఎవరూ ఒప్పుకొనేవారు కాదు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్గారిని నా ప్రపోజల్తో కలిశాను. ఆయనకు నా ఆలోచన నచ్చి వెస్ట్జోన్ కమిషనర్ హరిచందన గారికి నా పని అప్పగించారు. మొదటి స్టాండింగ్ కమిటీలో ‘ఇది అన్నపూర్ణ పథకం లాగానే ఉంద’ని రిజెక్ట్ చేశారు. అయినా నిరాశ చెందకుండా ఇరవై రోజులు మేయర్ ఆఫీస్ చుట్టూ తిరిగాను. నాలుగో స్టాండింగ్ కమిటీలో అంతా అంగీకరించారు. ట్రయల్ రన్లో భాగంగా రెండు పబ్లిక్ ఫ్రిజ్ల ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 10న అనుమతి వచ్చింది. ఫ్రిజ్ పెట్టేందుకు చిన్న స్థలం, విద్యుత్ను ఉచితంగా ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ ముందుకొచ్చింది.
ఆహారానికి విడివిడిగా రాక్స్…
ఆహారాన్ని నిల్వ ఉంచే ఫ్రిజ్ ఎలా ఉండాలనే దానిపై అనేక కసరత్తులు చేశాను. దాదాపుగా 30 స్కెచ్ల తరువాత లోగో డిజైన్ నేను అనుకున్నట్టు వచ్చింది. లోగోలో పైన ఒక మహిళ చేయి, కింద చిన్నారుల చేతులు కనిపిస్తాయి. పూల మొక్కలతో ప్రతి యూనిట్ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. రోడ్డు పక్కనే అర్థరాత్రి కూడా డిజైనింగ్ పనులు చూసుకునేదాన్ని. ఈ ప్రాజెక్టు, డిజైన్ కోసం ఇప్పటి వరకూ సొంతంగా 7 లక్షల రూపాయలు ఖర్చు చేశా. ఫ్రిజ్లో వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలు ఉంచేందుకు విడివిడిగా ర్యాకులు, అలాగే ఏ విధమైన ఆహారం ఫ్రిజ్లో ఉంచాలో సూచనలు రాసి ఉంచాను. బిస్కెట్లు, చాక్లెట్లు, వాటర్ బాటిల్స్ కూడా ఫ్రిజ్లో ఉంటాయి. 530 లీటర్ల ఫ్రిజ్ అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటుంది.
మొబైల్ యాప్ కూడా…
‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో మొబైల్ యాప్, మొబైల్ వ్యాన్ ప్రారంభించే ఆలోచనల్లో జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఉంది. పబ్లిక్ ఫ్రీజర్స్లో ఆహారం ఉంచాలనుకుంటున్న హోటళ్లు, సంస్థల, వ్యక్తులందరికీ ఈ యాప్ కామన్ ఫ్లాట్ఫామ్. ఆహారం ప్యాకింగ్ సరిగ్గా ఉందా? ఆకలితో ఉన్నవారితో ఆ ఫుడ్ చేరిందా? లేదా? తెలుసుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. ‘ఆపిల్ హోమ్స్’తో పాటు ‘ద రాబిన్ హుడ్ ఆర్మీ’ సంస్థ కూడా మొబైల్ వ్యాన్స్ను జీహెచ్ఎంసీకి అందించేందుకు అంగీకరించాయి. వాలంటైన్ డే (ఫిబ్రవరి 14న) సందర్భంగా ‘ఫీడ్ ద పూర్… స్ర్పెడ్ లవ్’ అనే కార్యక్రమాన్ని కూడా దీనికి అనుసంధానం చేసే ఆలోచనలో ఉంది జీహెచ్ఎంసీ.
లక్ష్యం… 100…
ఈ ప్రాజెక్టు జనవరి 31న హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలుత 10 యూనిట్లను నగరవ్యాప్తంగా పలుచోట్ల ఉంచాను. ప్రతి యూనిట్ వద్ద ఒక పర్యవేక్షకుడిని నెలకు ఆరువేల జీతానికి నియమించాను. ఆకలిగా ఉన్నవారికి ఆహారం అందిచడం, వండిన ఆహారం నాణ్యంగా ఉందా? ప్యాకింగ్ సరిగ్గా ఉందా? లేదా? గమనిస్తారు. కేవలం ఆటోవాలాలు, అనాథలు, కూలీలే కాదు ఆకలితో ఉన్నవాళ్లు కూడా వీటి ద్వారా తమ ఆకలి తీర్చుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతీ 10 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వంద పబ్లిక్ ఫ్రిజ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఒక్కో యూనిట్ ద్వారా రోజుకు 20 నుంచి 50 మంది ఆకలి తీర్చాలన్నదే నా లక్ష్యం. అయితే నేనొక్కదాన్ని అన్ని ఫ్రిజ్లు కొనడం సాధ్యంకాని పని. దాతలు ఎవరైనా ఫ్రిజ్ డొనేట్ చేస్తే వారి పేరు, ఫొటో, వివరాలు ముద్రిస్తాం. ఇక నా విషయానికొస్తే 2003లో అమ్మానాన్న చనిపోయారు. 2008లో విడాకులు తీసుకున్నా. నేను సింగిల్ పేరెంట్ను. నాకు ఏడేళ్ల పాప, ఆరేళ్ల బాబు ఉన్నారు. సంకల్పం బలంగా ఉండి, చిత్తశుద్ధితో, ధైర్యంగా ముందడుగు వేస్తే మహిళలు ఎవరి సపోర్టు లేకున్నా దూసుకుపోగలరనడానికి నేనే ఒక ఉదాహరణ.
వెలుగులు పంచుతున్నారు!
గాయత్రీ నారాయణ్ది కర్ణాటకలో తుమకూరు జిల్లాలోని మధుగిరి గ్రామం. ఆమె పదోతరగతి వరకే చదువుకున్నారు. అయితేనేం సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే విలవిల్లాడిపోతారు. ఒక రోజు టీవీలో నేత్రదానం గురించి ఒక కార్యక్రమాన్ని చూశారామె. అంధులు పడే కష్టాలు చూసి ఆమె చలించిపోయారు. అంధులకు చూపు ప్రసాదించాలన్న లక్ష్యంతో గాయత్రి 1989లో తొలిసారిగా తన నేత్రదాన ప్రయాణాన్ని మొదలెట్టారు. అయినవారిని పోగొట్టుకొని, పుట్టెడు శోకంలో ఉన్నవారిని నేత్రదానానికి ఒప్పించి, మృతిచెందిన వారి కళ్లు సేకరించడమంటే మాటలు కాదు. కానీ ఆ పనిని ఎంతో నేర్పుగా చేస్తారు గాయత్రి. ‘‘ నిజానికి మా కుటుంబంలో ఆడవాళ్లు సమాధుల వద్దకు అసలు వెళ్లరు. అలాంటిది నేను శ్మశాన వాటికల దగ్గరకు వెళ్లి, చనిపోయిన వారి కళ్లు సేకరిస్తున్నా. నేను చేసే పనివల్ల ఇద్దరు అంధులకు చూపు తేవచ్చనే ఆలోచనే ఆ క్షణం నా మదిలో ఉంటుంది’’ అంటారు గాయత్రి. స్వయంగా 35 మంది దాతల నుంచి కళ్లు సేకరించడమే కాకుండా, మరో 250 మంది నుంచి కళ్లు సేకరించడంలో డాక్టర్లకు సహకరించారామె.
సర్టిఫైడ్ కోర్సు చేశారు…
గాయత్రి పదోతరగతి వరకే చదువుకున్నా… అంధులకు చూపును ప్రసాదించాలన్న తపనతో మృతుల కళ్లను సేకరించే విద్యను నేర్చుకున్నారు. శాస్త్రీయంగా కళ్లను సేకరించడంలో శిక్షణ తీసుకొని, సర్టిఫికెట్ సంపాదించారు. మృతుల నుంచి సేకరించిన కళ్లను భద్రపరిచేందుకు నారాయణ నేత్రాలయ సంస్థ గాయత్రికి ఒక కిట్ ఇచ్చింది. ఆ కిట్ ఎక్కవ సంఖ్యలో కళ్లను భద్రపరిచేందుకు వీలుగా ఉంటుంది. సేకరించిన కళ్లను కిట్లోని శీతలీకరణ పరికరాల్లో ఉంచి, బెంగళూరులోని పలు కంటి నిధి కేంద్రాలకు చేరవేస్తారు.
మొదట్లో తిట్టేవారు..
ఎవరైనా చనిపోయారని తెలియగానే తన బృందంతో ఆ ప్రాంతానికి చేరుకుంటారు గాయత్రి. కొన్నిసార్లు రాత్రిపూట శ్మశానాల దగ్గరికి వెళ్లి కళ్లు సేకరించేవారు. కళ్లను సేకరించే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు భరించారు.‘‘చనిపోయిన వారి కళ్లను తీసుకొని, మార్కెట్లో అమ్ముకుంటున్నా నంటూ చాలామంది నన్ను దుర్భాషలాడేవారు. కానీ వారి మాటలు పట్టించుకోకుండా, నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోయేదాన్ని’ అంటారు గాయత్రి. ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత లేనప్పటికీ, స్వచ్ఛందంగా తన సేవను కొనసాగిస్తున్నారు. బెంగళూరులోని వరదాహిని సేవా ట్రస్ట్కు అనుబంధంగా ఆమె సొంతగా ఒక సంగ్రహ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం పేర విరాళాలు స్వీకరిస్తున్నారు. కళ్లను నగరానికి చేరవేసేందుకు రవాణా ఖర్చుల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు. నేత్రాలను ఆసుపత్రులకు తరలించే క్రమంలో ఆమె ఎక్కువగా ప్రజారవాణానే ఉపయోగిస్తాను. బస్సులు అందుబాటులో లేని పరిస్థితిలో క్యాబ్స్ను ఆశ్రయిస్తారు. కళ్లను సేకరించడమే కాదు… నేత్రదాన అవగాహన శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలను నేత్రదానం వైపు నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారామె. తన ముందు చూపుతో ఎంతోమందికి కంటివెలుగు ఇస్తున్న గాయత్రి సేవా ప్రయాణం స్ఫూర్తిదాయకం.
అనాథలకు అండ..
సేవా కార్యక్రమాలు చేసేందుకు నగరంలో అనేక స్వచ్ఛంద సంస్థలు వెలిశాయి. కానీ… డెబ్భై ఏళ్లు క్రితం నగరంలోని మెహిదీపట్నం నానాల్నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఓ ఆశ్రమం నేడు కూడా నిరంతరాయంగా సేవలందిస్తూ అందరి మన్ననలను అందుకుంటోంది. అనాథ పిల్లలను అక్కున చేర్చుకొనేందుకు ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. పుట్పాత్లపై వదిలే పసికందులను తమ అక్కున చేర్చుకొని సొంత పిల్లల్లా పెంచి, పెద్దచేసి పెళ్ళిళ్లు చేసిన ఖ్యాతి దక్కిందీ ఆశ్రమానికి. పెళ్లి చేసుకొని, కుటుంబ నియంత్రణ పాటించి అనాథ పిల్లలే తమ సొంత పిల్లల్లా భావించి సేవలందించారు ఈ హైదరాబాద్ చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీ వ్యవస్థాపకులు. వారే దివంగత వి.కె. దాగే, ఆయన భార్య టి. దాగే.
ఆశ్రమ చరిత్ర…
పచ్చటి హరితవనం మధ్య ఆశ్రమ భవనం కొనసాగుతుంది. అక్కడ ఉంటున్న పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో పెరుగుతున్నారు. డెభ్భై సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీని స్థాపించిన వి.కె. దాగే చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేశారు. అనంతరం ఆయన పార్లమెంట్ సభ్యులుగా కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పనిచేశారు. అదే పరిచయంతో జవహర్లాల్ నెహ్రూ ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అయితే మెహిదీపట్నం పరిసర ప్రాంతాల్లో తిరిగేటప్పుడు పుట్పాత్లపై పసికందులను వదిలివెళ్లిన దృశ్యాలను చూసి ఆయన చలించిపోయారు. అదే తడువుగా ఆ పసికందులను ఇంటికి తీసుకెళ్లి ఆలనా, పాలనా చూడడం ప్రారంభించారు. నాటినుంచి అనాథ శిశువులను అక్కున చేర్చుకుంటూ సేవలందిస్తూ వస్తున్నారు.
ఆ సేవలను చూసిన ఆయన ఇంటి పక్కనే ఉంటున్న టి.దాగే, అతనికి అండగా ఉంటూ సేవలందించడం ప్రారంభించింది. ఈనేపథ్యంలో వారిరువురూ వివాహం చేసుకున్నారు. అనాథ పిల్లలే తమ పిల్లలుగా భావించుకుని కుటుంబనియంత్రణ పాటించాలని నిర్ణయించుకున్నారు. అనాఽథ పిల్లల సేవలో తరించిపోయారు. వారు పెరిగి పెద్దవడంతో నానాల్నగర్ చౌరస్తాలో దాదాపు ఐదు ఎకరాల స్థలంలో అప్పట్లో చిన్న షెడ్డు ఏర్పాటు చేసి చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీ సంస్థను సాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1950లో ది హైదరాబాద్ చిల్డ్రన్స్ సొసైటీగా దానిని రిజిస్ర్టేషన్ చేశారు.
ఆశ్రమంలో 150 మంది ఆడపిల్లలు…
ప్రస్తుతం హైదరాబాద్ చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీ ఆశ్రమంలో 150 మంది ఆడపిల్లలు ఉంటున్నారు. కేవలం ఆశ్రమంలో ఆడపిల్లలకు మాత్రమే ప్రత్యేకత. అక్కడ చేరుతున్న పిల్లలు కోసం ప్రత్యేకంగా ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాలను కొనసాగిస్తున్నారు. అయితే అందులో ఉన్న ఆడపిల్లలు కళాశాల చదువులతోపాటు యూనివర్సిటీ చదువులు, నర్సింగ్ కోర్సులు చేస్తున్నారు. అంతేకాక సొసైటీ ఆధ్వర్యంలోనే వారికి వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లల రక్షణ కోసం కరాటే క్లాస్లు, స్వయం ఉపాధి కోసం అల్లికలు, కుట్లు, వస్తువులు తయారీ శిక్షణ ఇస్తున్నారు.
ఇక్కడ ఆశ్రమం పొందుతున్న ఆడపిల్లలంతా పెద్దవారై తమ కాళ్లపై తాము నిలబడే స్థాయిలో తీర్చిదిద్దడమే తమ ఆశ్రమ లక్ష్యమని సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర లోనియా, సెక్రటరీ అడ్మినిస్ర్టేషన్ అండ్ ఫైనాన్సర్ పూర్ణచందర్రావు, సెక్రటరీ జేనీ గుప్త చెపుతున్నారు. ఈ సొసైటీలో ప్రస్తుతం 25 మంది పనిచేస్తున్నారు. అంతేకాక సేవా దృక్పథం ఉన్న వారంతా తమ పెళ్లి రోజులకు, తమ పుట్టిన రోజులకు, తమ పిల్లల పుట్టిన రోజులకు ఈ ఆశ్రమానికి వచ్చి తమకు తోచిన సహాయం అందిస్తున్నారు.
మేనేజింగ్ కమిటీ…
ది హైదరాబాద్ చిల్డ్రన్స్ ఎయిడ్ సొసైటీ అధ్యక్షులు సురేంద్ర లూనీయా, ఉపాధ్యక్షులు కమల సురాణా, కార్యదర్శి అడ్మినిస్ర్టేషన్, ఫైనాన్సర్ పూర్ణచందరావు, కార్యదర్శి జేనీ గుప్తా, కోశాధికారి వినయ్ సురాణా, సంయుక్త కార్యదర్శి విమల భద్రుక, సభ్యులు దేవీచంద్ గాలా, శారద కోట్రాకా, చంద్రశేఖర్, పుష్ఫబూబ్, అంబరేశ్ పిట్టై.
ఆ వార్తల్లో నిజం లేదు : వైజయంతీ మూవీస్
మహానటి సినిమాను నిర్మించి టాలీవుడ్లో మళ్లీ తన సత్తాను చాటుకుంది వైజయంతీ మూవీస్. ఒకప్పుడు తిరుగులేని హిట్లు ఇచ్చిన ఈ సంస్థ గత కొంతకాలంపాటు విజయాలను అందించలేకపోయింది. మహానటి ఇచ్చిన కిక్తో మళ్లీ వరుసబెట్టి ప్రాజెక్ట్లను పట్టాలెక్కిస్తోంది. రీసెంట్గా ‘దేవదాస్’ తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సంస్థ ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాను నిర్మిస్తోంది.
అయితే సోషల్ మీడియాలో బుధవారం రోజున ఓ వార్త హల్చల్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. తాము చిరంజీవి 152వ సినిమాను నిర్మించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ.. మెగాస్టార్తో ఇప్పటికే నాలుగు బ్లాక్బస్టర్ హిట్ సినిమాలు చేశామని, ఐదో బ్లాక్బస్టర్ సినిమా చేస్తే తామే గర్వంగా ప్రకటిస్తామంటూ ట్వీట్ చేశారు.
మార్పుకి ముందడుగు
‘మీటూ’ అంటూ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి స్త్రీలు తమకు జరిగిన వైధింపుల గురించి బయటకు వచ్చి చెబుతున్నారు. వారి ధైర్యానికి మద్దతు లభిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో ఇకపై కలసి పని చేయబోమని పలువురు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. వికాస్ బాల్పై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనతో చేయబోయే ప్రాజెక్ట్ నుంచి వికాస్ని తప్పిస్తున్నాం అని అమేజాన్ సంస్థ పేర్కొంది. అలాగే ‘స్టాండప్ కామెడీ’ టీమ్ ఏఐబీ మీద వచ్చిన ఆరోపణల వల్ల హాట్స్టార్ తమతో వాళ్ల కాంట్రాక్ట్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
తాజాగా ఈ లిస్ట్లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తోడయ్యారు. ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా తర్వాత దర్శకుడు సుభాష్ కపూర్తో కలసి ఆమిర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. తాజాగా అతని మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించే సరికి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమిర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ఆ సారాంశం ఏంటంటే… ‘‘క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటూ సామాజిక సమస్యలకు పరిష్కారం వెతకడానికి నటులుగా మేం ప్రయత్నిస్తుంటాం.
మా నిర్మాణ సంస్థలో లైంగిక వేధింపులను అస్సలు సహించకూడదనే పాలసీ ఉంది. అంతే సమానంగా తప్పుడు ఆరోపణలను కూడా ప్రోత్సహించం. మేం త్వరలో మొదలుపెట్టబోయే ఓ ప్రాజెక్ట్లో ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి అని మాకు తెలిసింది. కేసు లీగల్గా నడుస్తున్నందు వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం. పాత తప్పులన్నీ సరిచూసుకొని మార్పువైపు అడుగు వేయడానికి ఇదో ముందడుగు. చాలా ఏళ్లుగా స్త్రీలు లైంగికంగా దోచుకోబడుతున్నారు. ఇది ఆగాలి’’ అని ఆమిర్ భార్య కిరణ్ రావ్, ఆమిర్ పేర్కొన్నారు. ‘ఓ వ్యక్తి’ అని ఆయన పేర్కొన్నది సుభాష్ కపూర్ గురించే అని బాలీవుడ్ టాక్.
ఆ పాటల్లో నేనుండటం ఆనందం
‘‘నా సినిమాల్లో మొదట్నుంచీ విలువలతో కూడిన హాస్యం, విలువలతో కూడిన కథలకే చోటు ఇచ్చా. 42ఏళ్లుగా ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో సంపాదించిన స్థానాన్ని కోల్పోలేదంటే కారణం అదే’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. సంజోష్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్’. కాసం సమర్పణలో పొన్నాల చందు, డా.ఎం.ఎస్. మూర్తి, ఎమ్. అరవింద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ పంచుకున్న చిత్ర విశేషాలు..
► నటీనటులు కాదు.. వారు చేసిన పాత్రలే ప్రేక్షకుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలా నా నట జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మరొక పాత్ర ‘బేవర్స్’ సినిమాలో చేశా. రమేష్ చెప్పాల ‘మీ శ్రేయోభిలాషి’తో రచయితగా నాకు పరిచయం. ‘ఆ నలుగురు’ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న నాకు అంతకంటే మంచి కథని ‘మీ శ్రేయోభిలాషి’కి ఇచ్చారు.
► సమాజంలో తండ్రి, పిల్లల మధ్య అనుబంధాన్ని ‘ఆ నలుగురు’లో చెప్పాం. ఆ బంధంలో మరో కోణాన్ని ఆవిష్కరిద్దాం అంటూ రమేష్ చెప్పాల ‘బేవర్స్’ కథ చెప్పాడు. తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతలేంటి? అనే విషయాలను వినోదాత్మకంగా చూపించాం. అందరికీ మా సినిమా నచ్చుతుంది. – ఇటీవల రెండు అగ్రదేశాల్లో జీవిత సాఫల్య పురస్కారం అవార్డు అందుకున్నా. అక్కడికెళ్లినప్పుడు ‘అప్పుల అప్పారావు, దివాకరం’ అంటూ నా పాత్రల పేర్లతోనే ప్రేక్షకులు పలకరించడం చాలా సంతోషంగా అనిపించింది. బాధ్యత లేకుండా తిరిగేవాణì్న బేవర్స్ అంటారు. కుటుంబంలో ఎవరు బాధ్యత లేకుండా తిరిగినా బేవర్సే. సమాజం ఇలా ఉందని కాకుండా, ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాం.
► కాలానికి అనుగుణంగా కథలు మారిపోతున్నాయి. ఓ సమకాలీన తండ్రి పాత్రని ‘బేవర్స్’లో చేశా. కూతురుకీ, తండ్రికీ… కొడుకుకీ, తల్లికీ మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అలా కూతురుని ప్రాణంగా ప్రేమించిన ఓ తండ్రి పాత్ర నాది. కొన్ని పాత్రలు నటుల్ని బాగా లీనం అయ్యేలా చేస్తుంటాయి. అదంతా కథ గొప్పతనమే.
► మనిషి జీవితంలో గుర్తుండిపోయేవి పెళ్లి, చావు. పెళ్లిలో నా ‘పెళ్లిపుస్తకం’ చిత్రంలోని ‘శ్రీరస్తు శుభమస్తు…’ పాట వస్తుంటుంది. ఆ పెళ్లిలో నేనున్నాననే అనుభూతి కలుగుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ‘ఆ నలుగురు’ సినిమాలోని ‘ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం’ అనే పాట వినిపిస్తుంటుంది. అలాగే తండ్రీకూతుళ్ల బంధం గురించి ‘బేవర్స్’లో ఓ పాట ఉంది. సుద్దాల అశోక్తేజ రాసిన ఆ పాటని ఎ.ఆర్.రెహమాన్లా ఆలపించాడు సంగీత దర్శకుడు సునీల్కశ్యప్.
► గతంతో పోలిస్తే చిన్న సినిమా విడుదల ఇప్పుడు చాలా సమస్యగా మారింది. అయితే మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. చిన్న సినిమా తీసేవాళ్లంతా చచ్చినట్టుగా మంచి సినిమానే తీయాలనే పరిస్థితి వచ్చింది. మేం కూడా ‘బేవర్స్’ అనే ఒక మంచి సినిమానే తీశాం.
పెళ్లి కావడంతో సరళం
సర్ కట్టమంచి రామలింగారెడ్డి గొప్ప విద్యావేత్త, సాహితీవేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపక అధ్యక్షులు. చమత్కార సంభాషణా ప్రియులు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు సెనేట్ సభ్యుల్లో పి.కమలమ్మ అనే యువతి ఉండేవారు. ఆమె సమావేశాల్లో చాలా పరుషంగా, కటువుగా మాట్లాడేవారు. అయితే ఆమెకు పెళ్లి కావడంతో ఇంటిపేరు ‘బి’గా మారింది. అదే సమయంలో ఆమె మాట కూడా కొంత మృదువుగా మారింది. సిఆర్ రెడ్డి గారు శ్లేష చమత్కారంతో పరుషంగా ఉన్న పి.కమలమ్మ పెళ్లి కావడంతో సరళంగా (బి.కమలమ్మ) మారారని చమత్కరించారు. దానికి కమలమ్మ సహా అందరూ నవ్వుకున్నారు.
అర్థమైందా నాన్నగారూ?
‘‘చూడండీ.’’
‘‘……….’’
‘‘మిమ్మల్నే’’
‘‘ఊ– రేపు నాకు బడిలేదు… నిద్రపోనీ.’’
‘‘మాట; – రేపు మీరు కార్తీక సోమవారం ఉంటారా?’’
‘‘సోమవారం ఉండటమా? ఎక్కడ?’’
‘‘ఎక్కడేమిటి? – ఇంకా మీకు మెలుకవ రాలేదూ? కార్తీక సోమవారం ఉపవాసం ఉంటారా?’’
‘‘ఉండను.’’
‘‘పోనీయండి, నేను సముద్ర స్నానానికి వెళ్లివస్తాను. కాస్త పిల్లలను చూస్తుండండి.’’
‘‘వద్దు…’’
‘‘పెద్దపిల్లను తీసుకొనే పోతాను. చిన్నవాళ్లను కాస్త చూస్తుండండి.’’
నిద్రమత్తులో ఏమన్నానో జ్ఞాపకం లేదు. ఆమె బండెక్కి వెళ్లటం నేను తలుపు వేసుకొని మళ్లీ వచ్చి పడుకోటం.
కాంతం ఇల్లు దాటిన పావుగంట కల్లా పసిది లేచి తల్లి పక్కలో లేకపోవటం మూలాన కెవ్వున ‘అమ్మా’ అని పిలిచింది. నేను లేవక తప్పింది కాదు. ‘‘అమ్మా లేచావు తల్లీ పడుకో’’ అన్నాను. నా మాటలు దానికి అర్థం అయితే గద! అట్లాగే మేకులాగ కూర్చున్నది నడిమంచం మీద ‘‘అమ్మ, అమ్మ’’ అంటూ.
నాలుగు వైపులా చూచి, అమ్మ రాకపోవటం మూలాన లేచి మేడ దిగటానికి పోతున్నది.
మెట్లు పసిది దిగలేదు. దాని ఉద్దేశాన్ని గ్రహించి క్రిందికి దింపాను. ముందు వంట ఇంట్లోకి వెళ్లింది ‘‘అమ్మా’’ అని ఏడుస్తూ. ఎవ్వరూ కనబడలేదు. తరువాత దొడ్డితలుపు దగ్గర నుంచుని ఏడ్చింది. తలుపు తీశాను. మసక చీకట్లోనే దొడ్డంతా వెతికింది. అమ్మ కనబడలేదు.
అమ్మ ఇంట్లో లేదన్న విషయాన్ని గ్రహించి అది నన్నే నమ్ముకొని నేను చెప్పినట్లు వింటుందని నా నమ్మకం. ఎత్తుకొని మళ్లీ మేడపైకి వచ్చాను. ఏడ్పు ఆపలేదు. అట్లా పెంకితనంగా ఏడ్వటం సమంజసంగా కనపడలేదు. ‘‘తల్లీ మీ అమ్మ సముద్రానికి పోయింది. గంటలో వస్తుంది’’ అని చెప్పాను.
దాని కాసంగతి బోధపడలేదనా? ‘‘అమ్మ– ఓ పోయి’’ అన్నది.
‘‘ఆ. అదీ. నీవు ఏడ్వవద్దు. బిస్కట్లు పెడతాను’’ అన్నాను.
ఇక ఊరుకోవలసిందేనా, న్యాయంగా? ఊరుకోదే! పైగా ఎత్తుకున్నా నిలవక పోవడం, భుజం మీద పడుకోబెట్టుకొని చిచ్చిగొట్టినా జారిపోవటానికి ప్రయత్నం చేయటం.
‘‘ఎట్లాగే నీతో, అమ్మాయీ, కోపం వస్తోంది’’ అని చెయ్యి ఎత్తి చూపి భయపెట్టాను. ఇంకా ఎక్కువైంది ఏడ్పు.
ఇంతలో ‘‘అమ్మా’’ అంటూ లేచాడు చిన్నవాడు. వీడు దానికంటె పెద్దవాడు. నాలుగో ఏడు. మాటలు అర్థం అవుతాయి.
‘‘నాయనా పడుకో’’ అన్నాను.
‘‘అమ్మేది’’ అన్నాడు.
‘‘అమ్మ ఇంకాసేపుట్లో వస్తుంది. తెల్లవారలేదు. నిద్రపో’’
‘‘నేను పడుకోను’’
‘‘పోనీ ఆడుకో… ఆ పుస్తకంలో బొమ్మలు చూచుకో.’’
‘‘వద్దు’’
‘‘మరి ఏం జేస్తావు?’’
‘‘అమ్మ పోతా.’’
‘‘ఓరి వెధవా– అమ్మ సముద్రానికి వెళ్లింది. నాలుగు మైళ్లుంది. నీవు నడవలేవు. ఇంకాసేపటికల్లా వస్తుంది’’ అన్నాను.
‘‘రాదు’’ అన్నాడు నిస్సందేహంగా. అన్నవాడు ఊరుకోక మేడ మెట్లు దిగి ప్రయాణం గట్టాడు. సముద్రానికి నాలుగేండ్ల వెధవ వెళ్లటం ఏమిటి? వీళ్లకు తెలివి ఎందుకుండదో.
గబగబ మెట్లు దిగి పోతున్నాడు. ఏమిటి వీడి సాహసం!
‘‘ఒరేయ్’’ అంటూ వాడ్ని రెక్కుచ్చుకున్నాను. ‘‘నాయనా, ఒరే… ఏడ్వకూ’’
వాడు మళ్ల ‘అమ్మా’ అన్నాడు.
‘‘వస్తుందిరా నాయనా, తెల్లవారేప్పటికి వస్తుంది.’’
‘రాదు’ అని ఒకటే ఏడ్వటం.
‘‘అబ్బబ్బ. చంపుతున్నావురా నాయనా. తప్పక వస్తుందిరా’’ అని అరిచాను కోపంతో. ఊహు. మహాప్రభూ– ఎట్లా వీడ్ని నమ్మించడం! పోనీ ఏదో అల్లాగ ఏడుస్తూ ఉన్నా ఒక సుగుణమే. కాళ్లొచ్చిన వెధవ. మేడ దిగి సముద్రానికి పోతానంటూ బయలుదేరుతున్నాడు. చిన్నది ఎత్తుకున్నా ఏడ్వటం మానలేదు. దాన్ని దింపేసి, వీడి దగ్గర చేరి ఎట్లాగయినా సముదాయిద్దామని కూర్చున్నాను.
చిన్నది నా పడకగదిలోకి వెళ్లింది. ఇంకో గదిలోకి వెళ్లింది. వాళ్లమ్మను నేను దాచేశానని కాబోలు దీని నమ్మకం.
చిన్న గదిలో సుశీ పడుకొని ఉన్నది. వాళ్లమ్మ చీర కప్పుకొని. చిన్నది ఆ చీర గుర్తుపట్టి అదే అమ్మ అనుకొని వెళ్లి అమాంతం దానిమీద పడ్డది. కెవ్వున కేకేసి ‘‘అమ్మా’’ అంటూ లేచింది సుశీ కూడా.
కాస్త పెద్ద పిల్లగదా ‘‘అమ్మా సుశీ, పసిదాన్ని కాస్త సముదాయించు’’ అన్నాను.
‘‘అమ్మ ఎక్కడి కెళ్లిందీ?’’ అన్నది సుశీ.
‘‘సముద్రానికి స్నానానికి’’
‘‘నన్ను తీసుకెళ్లలేదేం?’’ అని ఒక్క పెట్టున ఏడ్చింది.
‘‘ఓసి భడవా? నీవు కూడా ఏడిస్తే ఎట్లాగే? వీళ్లతోటే సతమతం అవుతుంటేను! వళ్లు పగలగొడతా ఏడిస్తివా అంటే!’’ అని భయపెట్టాను. ఇది మట్టుకు భయపడి ఊరుకుంది.
పసిది మాత్రం వెక్కి వెక్కి ఏడ్వటం మానలేదు. చిన్నవాడు ఒకే స్థాయిలో ఏడుస్తున్నాడు. అమ్మ వస్తుంది ఉండరా అని నేనూ, రాదనివాడూ వాదన.
తలబద్దలు కొట్టుకుందామనుకున్నంత విసుకు పుట్టింది. ఈ లోపున సుశీ మెల్లగా వెళ్లి నిద్రపోతున్న తమ్ముడ్ని లేపింది. అమ్మ వెళ్లిపోయిందని చెప్పేసింది. వాడో ఏడ్పు ఏడ్చాడు. భయపెడితే బిక్కముఖం వేశాడు.
‘‘నాయనా, మొగపిల్లలు ఏడ్వకూడ’’దని అప్పీలు చేశాను. ఎట్లాగయితేనేం మొగతనాన్ని నిలబెట్టాడు మా వాడు.
వాళ్ల ఇద్దర్ని ఎట్లాగో ఆపానుగాని పసివాళ్లనే ఊరుకోబెట్టడం నా తరం గాలేదు. బిస్కట్లు పెట్టాను. విసిరి పారేశారు. కర్జూరపండు ఇచ్చాను. మొఖాన కొట్టారు. ఆట వస్తువులు చూపాను. కాళ్లతో తన్నేశారు. చిన్నదానికి ఏమీ తెలియక ఏడ్పు. వాడు మొండితనాన ఏడ్పు. వీపుపైని చెళ్లున వేశాను నోరు మూయమని. వాడు ఏడస్తూ మెట్లు దిగాడు.
చీకట్లో భయపడతాడని పసిదాన్ని దింపి వాడి వెంటబడి గిలగిల కొట్టుకుంటూన్న వాడ్ని పట్టుకొచ్చాను.
ఈ లోపున పసిది మెట్లు దొర్లటానికి సిద్ధమైంది. మహాప్రభో!
పసిదాన్ని లాక్కొచ్చి మంచం మీద కూలేసి, చూస్తూ ఊరుకున్నాను. శత్రుసేనలు కోట తలుపులు బద్దలు కొట్టుకుని వస్తూంటే, ఏమీ చేయలేక నిలబడిపోయిన రాజులాగ.
అంతలో అరుణోదయం అయింది. ‘‘అమ్మాయీ, సుశీ, మీ అమ్మ వస్తున్నదేమో చూడూ వాకిట్లో కెళ్లి’’
ఏదీ? సుశీ లేదు. దాని తమ్ముడూ లేడు. గుండె గుభేలు మన్నది. వీధి తలుపు తీసివుంది. పెద్దగా కేకవేశాను. జాడ లేదు. ఆ పిల్ల చేతులకు బంగారపు గాజులున్నాయి. వాటి కాశపడి పిల్లదాన్ని ఎవరేం జేస్తారో? పోనీ వాళ్ల కోసం వెతుకుదామంటే వీళ్లిద్దరినీ వదలి ఎల్లాగ కదలటం!
ఇంతలో పసిముండ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది. భుజాల మీదే ఉంచుకొని పాలడబ్బా తీసి కొంచెం పాలు కలిపి, ‘అమ్మా తాగ’మని ఇచ్చాను. పుచ్చుకొని గుక్కెడు కామోలు ఆ గ్లాసు విసిరి కొట్టింది. బట్టంతా తడిసింది. మొఖం నిండా పాలచుక్కలు.
‘చీ–దీని దుంపతెగ… అవస్థ…’ అని విసుక్కొని ఇటు చూద్దును గదా, ఆ చిన్న వెధవ సందు దొరికింది గదా అని, సముద్రానికి ప్రయాణం గట్టి వాకిట్లోకి పోయినాడు. అపుడు తెలతెల వారుతుంది.
పరుగెత్తుకొని వెళ్లాను వాడ్ని పట్టుకొందామని. నాకు చిక్కకుండా పారిపోవాలనే ప్రయత్నంలో వాడు పరుగెత్తి జారి సైడుకాల్వలో పడ్డాడు. ఠకీమని దిగాను. మోకాలు లోతు మురుగులోకి. వాడ్ని చప్పున ఎత్తుకొని చంక నేసుకొన్నాను. వాడి ముఖం, వళ్లూ, అంతా బురద. నా బట్టలన్నీ బురద.
ఇంతలోకే చిన్నది కూడా అడుగులేస్తున్నది ఆ వేపే. ఎక్కడ పడుతుందోనని ఇంకో చంకలో ఎత్తుకున్నాను. అప్పుడు చూడాలి నన్ను.
ఈ స్థితిలో నేనుండగానే వాకిట్లో బండి ఆగటం ఆవిడ దిగటం తటస్థించింది.
నన్ను ఆ స్థితిలో చూచి నేను పడ్డ పాట్లన్నీ గ్రహించి, కాంతం నా పై జాలిపడి నాయందు సానుభూతి చూపి, తాను సుఖంగా సముద్రస్నానం చెయ్యటానికి వీలు కల్పించేందుకోసం, ఇంత అవస్థా నేను పడ్డందుకు నాయందు ఎంతో కృతజ్ఞత కలిగి, నన్ను ఎంతో థేంక్ చేస్తుందన్న ఆశతో అక్కడే నిలబడ్డాను.
వచ్చిందో అమ్మగారు నిప్పులు గక్కుతూ ‘‘ఇద్దరు పిల్లలనూ వదిలేశారేం? వంతెన మీద కూర్చుని ఏడుస్తున్నారు’’ అంటూ.
నేనేం మాట్టాడలేదు. చూడు నా అవస్థ– అన్నట్లు అక్కడే నుంచున్నాను. చూచింది ఒక్క నిమిషం. కొంచెం విచారం కళ్లలో. మళ్లీ చిరునవ్వు.
పసిది తాచులాగ జారిపోయింది తల్లి దగ్గరకు. పసివాడు పోయి కావలించుకున్నాడు.
కాంతం కూర్చుని పిల్లదానికి పాలిస్తూ ‘‘అమ్మా నా తల్లే, ఎంత ఏడ్చిందో! నోరెండి పోయిందా? నాన్నా… నా తండ్రి… ప్రాణాలన్నీ మీ మీదే ఉన్నాయి. ఎంత ఏడ్చావురా? నాయినా పడ్డావా?’’ అని మాట మీద మాట అంటూ దాన్ని ముద్దెట్టుకోనూ, వీడ్ని ముద్దెట్టుకోనూ, దాన్ని పలకరించనూ, వీడ్ని పలకరించనూ, ఇదే వరస!
ఈ మానవుడు పడ్డ కష్టానికి ఒక్క సానుభూతి వాక్యం, కృతజ్ఞతను సూచించు ఒక్క చూపు లేదు. పిల్లలకు తల్లే లోకమైంది. నాకు స్థానం ఏదీ!
అల్లాగ సూర్యుని కెదురుగా నిలబడిపోయేను వెర్రి చూపులు చూస్తూ.
రామాయణం… ఎందుకు చదవాలి?
భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు… రామాయణ, భారత, భాగవత గ్రంథాలు. రామాయణం ఆదర్శవంతమైన జీవితానికీ, భారతం మనం నిత్యం చూస్తున్న, అనుభవిస్తున్న నిజజీవితానికీ, భాగవతం దివ్యమైన జీవితం గడపడానికీ మార్గదర్శకాలుగా పెద్దలు పరిగణిస్తారు. ఈ మూడింటిలో రామాయణం ద్వారా జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, అలాంటి సందర్భాల్లో రాముడు ఎలా నడిచాడో తెలుసుకొని, వాటిని అనుసరిస్తూ ఆ సమస్యలను అధిగమించవచ్చు.
రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అలవాటు చేస్తుంది. సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. వ్యక్తితో మొదలైన సంస్కారం కుటుంబంలో, సమాజంలో వికసించాలి. దానివల్ల దేశం, ప్రపంచం చక్కబడతాయి. ఈనాడు మనం చూస్తున్న కులాలూ, మతాలూ, ప్రాంతాలు అనే అసహజ భావనలు వాటంతట అవే సమసిపోతాయి. ‘వసుధైక కుటుంబం’ అనే వేదవాక్కుకు సార్థకత ఏర్పడుతుంది. మనల్ని మనమే కాదు, సమాజాన్నీ, తద్వారా మానవులందరినీ రక్షించుకోవడానికి తోడ్పడుతుంది. ఇది జరగాలంటే ప్రతి వ్యక్తీ రామాయణంలో ఉటంకించిన భావాలను అర్థం చేసుకోవాలి. అందుకోసం రామాయణం చదవాలి. వర్తమాన పరిస్థితులకు అన్వయించుకోదగిన ఘట్టాలు ఎన్నో రామాయణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని:
దాంపత్య ధర్మం తెలుసుకోవడానికి…
వైదిక సంస్కృతిలో దాంపత్య ధర్మం అతి పవిత్రమైనది. ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా వాల్మీకి ప్రస్తావించాడు. సీతారాముల మధ్య నెలకొన్న ప్రేమానుబంధం అపురూపమైనది, ఆదర్శవంతమైనది. వారి మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమను బాలకాండలో (77-26, 27) వాల్మీకి ఇలా ఆవిష్కరించాడు-
‘‘ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి
గుణై రూప గుణై శ్చైవ భూయ ఏవాభ్య వర్ధత
తస్యాశ్చ భర్తా ద్విగుణాం హృదయే పరివర్తతే’’
అంటే రాముడికి సీత అంటే మిక్కుటమైన ప్రేమ. అందుకు కారణం తన తండ్రి దగ్గరుండి వివాహం జరిపించడం. పైగా సీతలో సహజంగా ఉన్న సౌందర్యం, సద్గుణాలు రాముడి హృదయాన్ని ఆకట్టుకోవడంతో ఆ ప్రేమ మరింతగా పెరిగింది. ఇక సీతకు రాముడి మీద ప్రేమ ద్విగుణీకృతంగా ఉంది. శివ ధనుర్భంగం చేసి, సీత హస్తాన్ని ఆయన అందుకున్నాడు మరి! అయితే తండ్రి వివాహం జరిపించడం ఏమిటి? దీనికి సమాధానం అరణ్యకాండలో సీత తన వివాహ వృత్తాంతాన్ని చెప్పినప్పుడు తెలుస్తుంది. శ్రీరాముడు శివ ధనుర్భంగం చేసిన తరువాత ‘‘ఇదిగో నా కుమార్తెను ఇస్తున్నాను, స్వీకరించు’’ అని జనకుడు అంటే, తన తండ్రి అంగీకరిస్తేనే కాని పాణిగ్రహణం చేయనని రాముడు అన్నాడనీ, దశరథుని అనుమతి లభించిన తరువాతే తనను పరిణయమాడాడనీ సీత చెబుతుంది.
దాంపత్యానికి ఉన్న పవిత్రత రామాయణంలో పలుచోట్ల ప్రస్తావితం అయింది. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వనవాసానికి పంపిన భర్తపై కౌసల్య కోపించకుండా, భార్యగా తన విధులను దుఃఖంలో కూడా నిర్వర్తించడం రామాయణంలో కనిపిస్తుంది. మానవుల్లోనే కాదు, రాక్షసుల్లో సైతం దాంపత్యానికి ఉన్న పవిత్రతను మండోదరి ద్వారా మనకు వాల్మీకి తెలియజేశాడు. కుటుంబానికి ధర్మబద్ధమైన దాంపత్య జీవితం మూలకందం. దాంపత్య ధర్మం గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి.
ఆదర్శాలు నేర్చుకోవడానికి…
గురుభక్తి, భాతృప్రేమ, సౌహార్దం తదితర గుణాలు కుటుంబంలోని పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమించాలి. పెద్దలు పరంపరానుగతంగా వస్తున్న సంస్కారాలను అలవరచుకొని పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. పిల్లలు తమ కర్తవ్యాన్ని విస్మరించకుండా వారికి శిక్షణ ఇవ్వాలి. ‘తరాల భేదం లేకుండా ఎలా ఉంటుంది?’ అని సాకులు చెబితే తమ సంతానానికే కాదు, సమాజానికి కూడా చెడు చేసినవారు అవుతారు. రామాయణంలో రాముడు ప్రదర్శించిన సుగుణాలను అనుసరించాలి. దానికోసం రామాయణం తప్పకుండా చదవాలి.
నిస్వార్థ ప్రవృత్తి కోసం…
‘అర్థం అన్ని అనర్థాలకూ మూలం’ అనేది నానుడి. సుఖమయ జీవితానికి అర్థం (సంపద) అవసరమే కావచ్చు. అదే పరమార్థం అనుకుంటే అంతకన్నా అనర్థం లేదు. ‘రాముడు వనవాసానికి వెళ్తాడో, లేదో?’ అని కైకేయి శంకిస్తుంది. అది రాజాజ్ఞ అని గుర్తు చేస్తుంది. అప్పుడు రాముడు కైకేయితో-
‘‘నాహ మర్థపరో దేవి! లోకమావస్తుముత్సహే
విద్ధి మామృషిభిస్తుల్యం విమలం ధర్మమాస్థితమ్’’ (అయోధ్య కాండ)
‘‘ఓ దేవీ! నేను అర్థప్రధానుణ్ణి కాను. నేను మంచి మార్గంలో నడుస్తూ, జగత్తును సక్రమమైన దారిలో నడిపించాలన్నదే నా కోరిక. నేను ప్రాధాన్యమిచ్చేది ధర్మానికే. నేను ఋషితుల్యుణ్ణి అనే విషయాన్ని గుర్తుంచుకో. తండ్రి ఆజ్ఞానుసారం వనవాసానికి ఇప్పుడే వెళ్తున్నాను’’ అంటాడు. అర్థకామాల కన్నా ధర్మమే శ్రేష్ఠమని రాముని మనసులోని మాట. వాటిని పరమ ధ్యేయంగా భావించిన రావణాదుల వంటి వారు ఎలా పతనమయ్యారో రామాయణం చెబుతుంది. వర్తమానంలో సంపద కోసం, అధికారం కోసం వెంపర్లాడుతున్న వారికీ, అందుకోసం ఏది చెయ్యడానికైనా వెరవని వారు… రామభరతాదుల నిస్వార్థ ధార్మిక ప్రవృత్తిని కొంతైనా అవగాహన చేసుకుంటే, వారి వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకు రామాయణమే శిరోధార్యం.
వ్యక్తిత్వ వికాసానికి..
ఓర్పు కలిగి ఉండడం అవశ్యమని రామాయణం ప్రవచిస్తుంది. ఎంత చిన్న కష్టమైనా సహించలేక ఆత్మహత్యలకు పాల్పడడం, తమ కష్టాలకు కారకులైన వారిని హత్య చెయ్యడం ఈనాటి కొందరి ప్రవృత్తి. కష్టాలను ధైర్య సాహసాలతో ఎదుర్కోవడమే జీవితానికి ఉత్తమ ఆదర్శం. ఉదాహరణకు హనుమంతుణ్ణీ, సీతనూ పేర్కొనవచ్చు. ఒకానొక సమయంలో, సీత జాడ తెలుసుకోలేక హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఒక్క క్షణం ఆలోచించి, ఆత్మహత్య ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో అర్థం చేసుకొని-
‘‘అనిర్వేదః శ్రియో మూలం
అనిర్వేదః పరం సుఖం’’
‘‘దిగులు చెందకుండా ఉండడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. అదే సమస్త సుఖాలకూ మూలం’’ అంటాడు. అంతే కాకుండా-
‘‘వినాశే బహవే దోషా జీవన్
ప్రాప్నోతి భద్రకమ్’’‘
‘‘మరణిస్తే ఏముంది? అన్నీ దోషాలే. జీవించి ఉంటే ఎప్పటికైనా విజయం ప్రాప్తిస్తుంది’’ అని అంటాడు. సుందరకాండలో హనుమ, సీతల మనస్సులను చదివితే దైవబలం ఎంతటి ధైర్యాన్నిస్తుందో అర్థమవుతుంది. ఇది తెలుసుకోవాలంటే రామాయణమే దారి చూపిస్తుంది.
ఆదర్శవంతమైన జీవితానికి రామాయణం ఆటపట్టు. ఆదర్శ జీవితం గడుపుతూ, పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన శ్రీరాముడు రామరాజ్యాన్ని వ్యవస్థీకరించాడు. ఈనాటి ప్రభుత్వాలకూ, అధికారులకూ అనుసరణీయమైన ఎన్నో విషయాలను రామాయణం తెలియజేస్తుంది. అయోధ్య కాండలో- రామభరతుల సంవాదంలో పరిపాలనా సూత్రాలెన్నిటినో భరతుడికి రాముడు వివరించాడు.
కథగా చెప్పుకుంటే- రాముడిలో ధైర్య స్థైర్యాలు నింపడానికి సిద్ధాంతపరంగా వశిష్ఠుడు కృషి చేస్తే, దాన్ని ఎలా ఆచరణలో పెట్టి విజయం చేకూర్చుకోవచ్చు అనేది విశ్వామిత్రుడు వివరించాడు. రామాయణం చదివితే సంభాషణా నైపుణ్యం తెలుస్తుంది. వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. అన్నిటికన్నా మానసిక చైతన్యం, ధైర్య స్థైర్యాలు, ముఖ్యంగా నీతి, నిజాయతీలు, కార్యసాధనా నైపుణ్యం లాంటివి కరతలామలకం అవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ రామాయణాన్ని తప్పనిసరిగా చదవాలి.
ధర్మం తప్పని మానవరూపుడు
మహాకవి వాల్మీకి రామాయణాన్ని ఆద్యంతం ఎంతో రమణీయంగా, మనం అందరం అనుసరించే విధంగా… భగవదవతారుడైన శ్రీరాముణ్ణి మానవమాత్రుడిగా మాత్రమే చూపిస్తూ, ఆదర్శవంతమైన, ధర్మయుతమైన మార్గాన్ని మన ముందు ఉంచాడు. రామాయణంలోని బాలకాండ మొదలు యుద్ధకాండ వరకూ రాముడు మానవునిగానే ప్రవర్తించిన తీరును వాల్మీకి అత్యద్భుతంగా చూపాడు. బ్రహ్మాది దేవతలూ, ఋషులూ ఆయా సందర్భాల్లో రాముడు విష్ణ్వావతారం అని చెప్పినా, చివరివరకూ తాను దశరథ నందనుడినేనని రాముడు చెప్పుకొచ్చాడు. జీవితాంతం ధర్మమార్గాన్ని విడిచిపెట్టలేదు. తన ఆదర్శాలకు కళంకం రానివ్వలేదు. శ్రీరాముడి జీవితంలో ఇటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి.
మంచి విషయాలు నేర్చుకోవాలంటే…
స్మార్ట్ ఫోన్ వాడే వారిలో చాలా మంది చేసే తప్పు ఇదే..!
తిరిగి ఇచ్చేద్దాం.. ప్రకృతికి ప్రేమతో!
ప్రకృతి మనకు చాలానే ఇస్తోంది.. ఎంతో కొంత మనమూ తిరిగి ఇచ్చేయాలి… లేకుంటే… బతుకే భారం అవుతుంది. చిక్కి సగమైపోతాం!
అందుకు కనిపిస్తున్న ఫొటోనే సాక్ష్యం.. ‘మొన్నీ మధ్యే ఎక్కడో చూశాం!’ అనుకుంటున్నారా?
కరెక్టే… కేరళలో. సభ్య సమాజానికి ప్రకృతి పంపిన పిక్చర్ మెసేజ్
అది చూశాక మీకేమనిపించింది? ఆలోచించారా? మీ బాధ్యతేంటో గ్రహించారా? సమయం మించిపోలేదు ఫ్రెండ్స్..
ప్రకృతి ఒడిలో ప్రేమని తీసుకుంటూనే… తిరిగి ఇచ్చేద్దాం! అందుకు చాలానే చేయొచ్చు.
చిన్నప్పుడు పాకిన ఇంటి వసారా.. తప్పటడుగులు వేసిన వాకిలి.. గెంతుతూ తిరిగిన వీధి.. సైకిల్పై చక్కర్లు కొట్టిన కాలువ వంతెన… కో కో ఆడిన స్కూల్ మైదానం.. టీ20లతో సిక్స్లు.. ఫోర్లు బాదిన కాలేజీ గ్రౌండ్… అన్నీ ఒక్కసారిగా.. జలమయం. రెండు మూడు రోజులు కానరాని ఆనవాళ్లు… అన్నీ జ్ఞాపకాలయ్యాయి. అంతా అయోమయం. పచ్చని ప్రకృతిలో పిచ్చుకల్లా ఎగిరిన వారంతా బిక్కుబిక్కుమంటూ పునరావాసాల్లో దాక్కున్నారు. అయ్యో అన్నాం.. మానవత్వం చూపాం.. చేయీ చేయీ కలిపాం.. సాయం అందించాం. అంతేనా? ఇంకేం లేదా? అప్పుడెప్పుడో వైజాగ్… ఇప్పుడు కేరళ.. తర్వాత?? మరో చోట. ఇంకో రకంగా! అసలీ ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తున్నాయ్? సింపుల్… మనం మనచుట్టూనే తిరుగుతున్నాం. మన వరకే ఆలోచిస్తున్నాం. మనకేం కావాలో తెలుసుకునేందుకునే అందరి అన్వేషణ. ఈ నేపథ్యంలో అమ్మ ఒడిలాంటి ప్రకృతి ఒడిని పూర్తిగా విస్మరిస్తున్నాం. మీకు గుర్తుందా? మన్ను తిన్న రోజులు… బురదలో వేసిన కప్పగెంతులు.. ఏమైందా కనెక్షన్?
* చెప్పుల్ని వదిలి పాదాలు… మట్టిని తాకింది చివరిగా ఎప్పుడు?
* మౌస్ని వదిలి సీతాకోక చిలుక రెక్కల్ని సుకుమారంగా తాకిందెప్పుడు?
* తాకేతెరపై నడియాడే మునివేళ్లు మొక్కల్ని మమకారంగా నిమిరిందెప్పుడు?.. ఆలోచిస్తున్నారా? ప్రకృతి నుంచి తీసుకోవడానికే అలవాటు పడి… తిరిగి ఇవ్వాలనే ధ్యాసనే కోల్పోయాం. ఓపికకూ ఓ హద్దుంటుంది. ఎన్నని.. ఎన్నేళ్లని ప్రకృతి తనలో ఐక్యం చేసుకుంటుంది. విసుగొచ్చిన విరుచుకు పడుతుంది. అంతదాకా రాకూడదంటే? తీసుకోవడమే కాదు.. ప్రకృతికి తిరిగి ఇవ్వడంలోనూ ఆనందం వెక్కుకుందాం!!
* కాలేజీ బ్యాగులో ఛార్జర్, పవర్బ్యాంకు, పుస్తకాలతో పాటు మీకు ఇష్టమైన బుజ్జి ప్లేటుని పెట్టండి. ఫ్రెండుతో పానీపూరీనో.. ఛాట్ మాసాలానో తిందాం అనుకున్నప్పుడు బ్యాగులోని ప్లేటునే వాడండి. దీంతో ఏడాదంతా కనీసం ఓ రెండు వందల ప్లాస్టిక్ ప్లేట్స్ని ప్రకృతి ఒడిలోకి రాకుండా ఆపొచ్చు.
* పేరెంట్స్ మీటింగ్లు, కాలేజీ ఫంక్షన్స్లో హాజరయ్యేందుకు వచ్చిన వారికి ముగింపు రోజున చిన్న ప్యాకెట్స్లో పలు రకాల విత్తనాల్ని ఇవ్వండి. వెళ్లే దార్లో ఎక్కడైనా ఖాళీ ప్రాంతాల్లో వాటిని జల్లమని కోరండి. కొన్ని వందల చెట్లని ప్రకృతికి జత చేసినవారవుతారు.
* చెట్టుకు నీరెంత ముఖ్యమో. వాటిపై ఆడే పక్షులకూ నీరంతే అవసరం. క్యాంపస్లోని అన్ని చెట్లకింద నీళ్లు పెట్టండి. అదీ రీసైకిల్ చేసిన బాటిల్ గిన్నెలతో!! క్రియేటివ్గా కొమ్మలకు కట్టండి. ఓ సెల్ఫీతీసి పోస్ట్ చేయండి.
నీళ్ల బాటిల్ తాగేశాక వంతెనలు, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో పడేస్తుంటారు. అలా చేయకుండా.. బాటిల్ని మీదైన పద్ధతిలో రీసైకిల్ చేయండి. బాటిల్ పెద్దగా ఉంటే దాంట్లో మొక్కల్ని నాటే ప్రయత్నం చేయొచ్చు.
* కాలేజీ, స్కూళ్లలో గేటుకి ఇరువైపులా నిలబడి స్వాగతం చెప్పే చెట్లు మొదలుకుని.. మొత్తం కాంపౌండ్లో ఎన్ని చెట్లున్నాయో ఎప్పుడైనా లెక్కించారా? ఒక్కసారి గణించండి. ఒక్కొక్కరికీ ఒక్కో మొక్కుంటే మీకు తోడు దొరికినట్టే. అలా కాకుంటే వెంటనే మీ కోసం ఓ మొక్క నాటండి.
* కాలేజీ, స్కూళ్లలో గేటుకి ఇరువైపులా నిలబడి స్వాగతం చెప్పే చెట్లు మొదలుకుని.. మొత్తం కాంపౌండ్లో ఎన్ని చెట్లున్నాయో ఎప్పుడైనా లెక్కించారా? ఒక్కసారి గణించండి. ఒక్కొక్కరికీ ఒక్కో మొక్కుంటే మీకు తోడు దొరికినట్టే. అలా కాకుంటే వెంటనే మీ కోసం ఓ మొక్క నాటండి.
* బయటికి వస్తే చాలు. ముఖానికి ఒకటి.. తలకొకటి.. స్కార్ఫ్లు. చేతికేమో గ్లౌజ్లు. ఇలా మన అందం, ఆరోగ్యం పాడవకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ, ప్రకృతి అందాన్ని కాపాడేందుకు ఏం చేస్తున్నాం? సింపుల్… ప్లాస్టిక్కి ‘నొ’ చెబుతూ… రోడ్డు పక్క బండిపై కొన్న యాపిల్ పళ్లను స్కార్ఫ్ల్లో మూటగట్టుకుని వెళ్లండి. ఏడాది మొత్తంలో కొన్ని వందల ప్లాస్టిక్ కవర్లను భూదేవీ ఒడిలో చేరకుండా అడ్డుకోవచ్చు.
* స్కూలు, కాలేజీల్లో గ్రూపులుగా పిక్నిక్లకు వెళుతుంటాం. వెళ్లిన చోట ముందే కొన్ని బోర్డులు తయారు చేసి అందరికీ కనిపించేలా పెట్టండి. అదేంటంటే.. ‘మనం ఈ చోటు విడిచి వెళ్లేటప్పుడు.. వచ్చినప్పటికంటే మరింత శుభ్రంగా ఉండేలా బాధ్యతగా నడుచుకోమని’.
* కాలేజీ బస్సుల్లో రోజూ వెళ్తుంటాం. తాగేసిన కోక్ టిన్ని వెనకా ముందు ఆలోచించకుండా కిటికీలో నుంచి బయట పడేస్తాం. లేదంటే కూర్చున్న సీటు కిందే వదిలేస్తాం. నమిలేసిన బబుల్గమ్ని ముందు సీటు కిందో, వెనుకో అతికించేస్తాం. అలా కాకుండా.. ఓ చెత్తబుట్టని కాలేజీ బస్సుల్లో అందరికీ కనిపించేలా అందంగా అలంకరించి అమర్చండి. దాంట్లోనే చెత్తని వేయండి. రోజుకి ఒకరు బాధ్యత తీసుకుని చెత్తని మున్సిపాలిటీ చెత్త కుండీల్లో పడేయండి.
* శుభకార్యాలు, పండగల సందర్భంగా ఇంటినెలా శుభ్రం చేసుకుంటామో… మీరు నిత్యం కూర్చుని ఊసులాడుకునే అడ్డాలనూ క్లీన్ చేయండి. ఉదాహరణకు మీ కాలేజీ, స్కూల్ క్యాంపస్ల్లో కూర్చునే పిట్టగోడల్ని అందమైన రంగులతో అలంకరించి. ఒకటి రెండు మొక్కలు నాటండి. వాటినీ మీ బ్యాచ్లో సభ్యులుగా చేర్చుకుని పేర్లు పెట్టండి. మీరు ఉన్నంత కాలం సంరక్షించి తర్వాత జూనియర్లకు బాధ్యత అప్పగించండి. మీరెప్పుడు క్యాంపస్కి వెళ్లినా వాటి పలకరింపులు చెప్పలేని ఆనందాన్నిస్తాయి.
* ప్రకృతి గొప్పదనాన్ని తెలిపేలా కవితలు, కథలు, పాటలు రాసి కాలేజీ ఫంక్షన్స్లో ప్రదర్శించండి. రోజూ క్లాస్రూంలోని బ్యాక్బోర్డుపై ఓ కవితో, కొటేషనో రాయండి.
* కాలేజీకి వెళ్లే బైక్ వెనక పలు రకాల మెసేజ్లు, ఇష్టమైన వ్యక్తుల బొమ్మల్ని స్టికర్ల రూపంలో అతికిస్తాం. ఆ స్థానంలో ప్రకృతికీ చోటిద్దాం. నేచర్కి ఉన్న ప్రాధాన్యత చెబుతూ బొమ్మలు, మెసేజ్లు అతికించండి.
* మీరున్న ప్రాంతంలో నదులు, సముద్రాలుంటే వాటిని శుభ్రం చేసే బాధ్యత తీసుకోండి. బృందాలుగా ఏర్పడి వాటిని మీరే దత్తత తీసుకోండి. ఇతరుల్నీ ప్రేరేపించేలా శుభ్రం చేసిన ప్రాంతంలో స్పెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి.
* మొక్క నాటుతూ.. నీళ్లు పోస్తూ సెల్ఫీలకు ఫోజులివ్వడం. సోషల్ వీడియాలో షేర్ చేయడం. తర్వాత నాటిన మొక్క ఏమైందో అనే ధ్యాసకంటే.. లైక్లు, కామెంట్లను చూసే ధ్యాసే ఎక్కువ అవుతుంది. నాటడానికి పట్టేది రెండు నిమిషాలే.. బతికి అది ఓ వృక్షం అయ్యేందుకు చేసేది పోరాటం. ఇప్పుడు మనం చూస్తున్న వృక్షాలన్నీ ఎందరో మంచి మనుషులు చేసినా పోరాటాల ఫలితం. మరి, మీది ప్రయత్నమా? పోరాటమా?
* నెలలో ఒకరోజుని ‘ఎర్త్డే’గా పరిగణిస్తూ ఆ రోజంతా విద్యుత్ వాడకాన్ని నివారించాలి. ఆ రోజు ఫోన్లో ఛార్జింగ్ లేకున్నా ఛార్జింగ్ పెట్టకూడదు. కంప్యూటర్ని వాడకుంటే స్వీచ్ఆఫ్ చేయడం. లేదంటే.. కనీసం మానిటర్ని ఆఫ్ చేయండి. లిఫ్ట్ని వాడే క్రమంలో దిగ్గానే ఫ్యాన్, లైట్ ఆఫ్ చేయండి. కాలేజీ, స్కూల్, అపార్ట్మెంట్ల్లోని లిఫ్ట్ల్లో ‘యూజ్ లెస్ అండ్ లిఫ్ట్ యువర్ లైఫ్’ అని రాసిపెట్టండి.
* గార్డెనింగ్ని ఓ హాబీగా చేర్చండి. మనల్ని విడిచి వెళ్లిపోయిన ఆప్తుల పేరుతో ఓ మొక్క నాటండి. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైపోండి.
షియోమీ ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2 విక్రయం ప్రారంభం
మొబైల్ తయారీదారు షియోమీ సంస్థ తన ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2ను భారత మార్కెట్లో మంగళవారం నుంచి విక్రయించనుంది. ఈ షూస్ వినియోగదారులకు రూ.2,999 ధరతో లభిస్తున్నాయి. ఎంఐ ఆన్లైన్ స్టోర్లో ఈ షూస్ను కొనుగోలు చేయవచ్చు.
కాగా ఈ షూస్ను 5 భిన్నమైన మెటీరియల్స్తో తయారు చేసినందున అంత త్వరగా డ్యామేజ్ కావు. అలాగే వీటిని మరింత మన్నికగా ఉండేలా తయారు చేశారు. ఈ షూస్ను చాలా సులభంగా క్లీన్ చేయవచ్చు. బ్లూ, బ్లాక్, డార్క్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ షూస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
వచ్చే వారంలో విడుదల కానున్న ఒప్పో ఎ5ఎస్ స్మార్ట్ఫోన్
మొబైల్ తయారీదారు సంస్థ ఒప్పో వచ్చే వారం భారత మార్కెట్లోకి తన నూతన స్మార్ట్ఫోన్ ఎ5ఎస్ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ రూ.10 వేల ప్రారంభ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరిచారు.
ఒప్పో ఎ5ఎస్ ప్రత్యేకతలు:
* 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే,
* 1520 × 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్,
* 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్,
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
* 13, 2 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ,
* బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చబడి ఉంది.
మరోసారి ఆఫర్లతో ముందుకొస్తున్న షియోమీ
చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమీ ‘ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్’ పేరుతో మరోమారు ఆఫర్ల వాన కురిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్ ఆఫర్లో పోకో ఎఫ్1, రెడ్మీ నోట్ 6 ప్రొ తదితర స్మార్ట్ఫోన్లతోపాటు ఎంఐ లెడ్ టీవీ 4 ప్రొ, ఎంఐ బ్యాండ్, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 25 వంటి వాటిపై కూడా భారీ రాయితీలు ప్రకటించింది. సేల్ కొనసాగనున్న ఈ మూడు రోజులు రూపాయి ఫ్లాష్ సేల్, మిస్టరీ బాక్స్ సేల్ కూడా నిర్వహించనుంది. ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోం, ఎంఐ స్టోర్లలో సేల్ కొనసాగనుంది.
ఈ మేరకు పోకో ఎఫ్1 6జీబీ ర్యామ్+28 జీబీ వేరియంట్ ధరను రూ.22,999 నుండి రూ.20,999కి తగ్గించగా… 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్, 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ వేరియంట్లను కలిగి ఉన్న రెడ్మీ నోట్5 ప్రొ అసలు ధరలు వరుసగా రూ.12,999, రూ.13,999గా ఉంటూండగా ఇప్పుడు వాటిని వరుసగా రూ.10,999, రూ.11,999కి అందజేస్తోంది. రెడ్మీ నోట్ 6 ప్రొ 4జీబీ+64 జీబీ ధరను రూ. 3 వేలు తగ్గించి రూ.10,999కే అందుబాటులోకి తీసుకువచ్చింది.
వీటితోపాటుగా కంపెనీ తాజాగా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రొ, రెడ్మీ గో స్మార్ట్ఫోన్లను కూడా ఈ సేల్లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ సేల్లో రెడ్మీ 6, రెడ్మీ 6 ప్రొ, రెడ్మీ 6ఎతోపాటు పలు ఫోన్లు రాయితీలపై లభించనున్నాయి. ఎంఐ కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్ 2 (రూ.699), ఎంఐ ఇయర్ఫోన్స్ (రూ.599), ఎంఐ బాడీ కాంపోజిషన్ (రూ.1,499), ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్ (రూ.8,499), ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్ (రూ.999) లను విక్రయంలో భాగంగా లిస్ట్ చేసింది.
కాగా… హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ.500 తక్షణ డిస్కౌంట్ లభించనుండగా… మొబిక్విక్ వినియోగదారులకు 15 శాతం తక్షణ మొబిక్విక్ సూపర్ క్యాష్ లభిస్తుంది. ఈ సేల్ మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా తగ్గింపు మొత్తం గరిష్టంగా రూ.2 వేల వరకు మాత్రమే లభిస్తుంది.
మహిళల్లో నిద్రలేమికి…
నిద్రలేమి అనగానే ఎవరికైనా, వెంటనే గుర్తుకు వచ్చేవి నిద్రమాత్రలే. ప్రత్యేకించి మహిళల్లో ఈ సమస్య మరికాస్త ఎక్కుకే కాబట్టి. వెంటనే నిద్ర మాత్రలు తెచ్చేసుకునే ప్రయత్నమే చేస్తారు. అంతేగానీ, నిద్ర పట్టకసోవడానికి గల అసలు కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నమైతే చాలా మంది చేయరు. అయితే నిద్రలేమికి ఇప్పటిదాకా తెలిసిన ఇతర కారణాల మాట ఎలా ఉన్నా, ఇటీవల ఒక కొత్త కారణం వెలుగు చూసింది.
అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మధ్య ఆ కొత్త కారణాన్ని కనుగొన్నారు. ఏ కారణంగానైనా సర్జరీ ద్వారా గర్భసంచి తొలగించడంతో వచ్చే మెనోపాజ్ వల్ల ఈ నిద్రా సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని వారు తెలుసుకున్నారు. అయితే, వయసు దాటిపోయి సహజసిద్దంగా మెనోపాజ్ వచ్చిన వారిలో ఈ సమస్యలు అంతగా లేవని వారు గమనించారు. అర్థంతరంగా గర్భసంచి తీసివేయడం ద్వారా హార్మోన్ వ్యవస్థలో, జీవక్రియల్లో చోటుచేసుకునే తేడాలే ఈ నిద్రలేమికి కారణమని వారు చెబుతున్నారు. దీనివల్ల శారీరక సమస్యగానే కాకుండా, ఒక దశలో దిగులు, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.
బాడీ లాంగ్వేజ్ బాగుంటేనే..!
ఎదుటి వారు మనతో ప్రవర్తించే విధానం మన బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. నిలబడే తీరు, ముఖంలో ఒలికే కవళికలు మనల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. అలాంటి కొన్ని ట్రిక్స్ మీకోసం!
పోశ్చర్: నడిచేటప్పుడు భుజాలు వెనక్కి, చుబుకం పైకి ఉండాలి. నిటారుగా ఉండాలి. శరీరం గురించిన కాన్షియస్ కలిగి ఉండాలి.
ముఖకవళికలు: ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలి. అప్పుడే ఇతరులు మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు. చిరునవ్వుతో మీ గురించి ఎదుటివాళ్లలో సద్భావన
కలుగుతుంది.
స్వరం: అనవసరంగా గొంతు పెంచి మాట్లాడకూడదు. సందర్భాన్నిబట్టి స్వరం మారుస్తూ ఉండాలి. మార్దవం, గంభీరం, సున్నితత్వం స్వరంలో సందర్భానుసారంగా తొణికిసలాడాలి.
చేతుల కదలికలు: అవసరాన్నిబట్టి భావ వ్యక్తీకరణకు తోడ్పడేలా చేతులు కదిలించాలి. మీరు వ్యక్తం చేయదలచుకున్న విషయాన్ని చేతుల కదలికలు స్పష్టం చేసేలా ఉండాలి.
కళ్లు: పరిచయం చేసుకునేటప్పుడు సూటిగా కళ్లలోకి చూడాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడూ కళ్లలోకి చూస్తూ వినాలి.
నడక: ఎంత హడావుడిలో ఉన్నా ఆ తొందర నడకలో ప్రతిబింబించకూడదు. నడకలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి.
డబ్బు లెక్క మంచిదే!
ఇంటిని చక్కదిద్దే మహిళలకు… డబ్బును లెక్కప్రకారం ఖర్చుచేయడం, పొదుపు చేయడం ఎలాగో తెలియడం కూడా ఎంతో ముఖ్యం. డబ్బు నిర్వహణ మీద అవగాహన పెంచుకుంటే ఆర్థికంగా ఎదురయ్యే ఒడుదొడుకులను తట్టుకోవడం సులభమవుతుంది. అదెలాగంటే…
తక్కువ ఖర్చు: సంపాదన కన్నా ఖర్చు తక్కువ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. తెలివైన నిర్ణయం కూడా. పొదుపు చేయలేదంటే ఆర్థిక చిక్కులు తప్పవు. ఆదాయంలో నెలనెలా కొంత పొదుపు చేయాలి. ఆ డబ్బుతో భవిష్యత్ అవసరాలను తీర్చుకోవడం సులభమవుతుంది.
ఎమర్జెన్సీ ఫండ్: మీ ఆరు నెలల ఖర్చులను ఫిక్స్డ్ డిపాజిట్ లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ కింద భద్రపరచుకోవాలి. ఈ డబ్బు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.
బీమా: ప్రస్తుత కాలంలో బీమా అనేది అందరికీ తప్పనిసరి. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ఆరోగ్య బీమా, జీవిత బీమా తీసుకోవాలి. దీంతో క్లిష్ట సమయంలో డబ్బు కోసం అగచాట్లు పడాల్సిన పరిస్థితి తప్పుతుంది.
ఆర్థిక లక్ష్యాలు: ముందస్తు ఉద్యోగ విరమణ, కొత్త ఇల్లు కొనడం, పిల్లల చదువుల ఖర్చులు వంటి ఆర్థిక లక్ష్యాలు చాలామందికి ఉంటాయి. ఏ అవసరానికి ఎంత డబ్బు అవసరమవుతుందనే విషయంలో స్పష్టత ఉంటే ఎంత డబ్బు పొదుపు చేయాలో తెలుస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు రావు.
తాత్కాలిక ప్లాన్: ఈక్విటీ మార్కెట్లోని డబ్బు సమయానికి అందకపోవచ్చు. అయిదు సంవత్సరాల లోపే డబ్బు అవసరం పడే పరిస్థితుల్లో డెట్, అర్బిట్రేజ్ ఫండ్స్ను ఎంచుకోవడం మేలు.
దీర్ఘకాలిక లక్ష్యాలు: సొమ్మును దీర్ఘకాలికంగా (దాదాపు అయిదు సంవత్సరాలు) మదుపు చేయడం మంచి ఆలోచన. దానివల్ల ఏడాదికి పది శాతం, తరువాతి రెండు సంవత్సరాల్లో ఇరవై నుంచి ముఫ్పయి శాతం, పది సంవత్సరాల్లో 40- 50 శాతం పెరుగుతుంది. మార్కెట్ ఒడుదొడుకులకు లోనైనా నష్టం రాదు.
రంగులతో జర జాగ్రత్త!
రంగుల పండుగ హోలీని పెద్దలతో పాటు పిల్లలు కూడా జోష్తో జరుపుకుంటారు. అయితే రసాయనాలతో చేసిన రంగులు చర్మంతో పాటు కళ్లకు కూడా హాని చేస్తాయనే విషయం పిల్లలకు తెలియదు. అందుకే హోలీకి కొన్ని ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల సంతోషాలకు భద్రత కూడా జతకూడుతుంది. అవేమిటంటే…
పర్యావరణ హిత రంగులు: పెద్దలు సేంద్రియ రంగులను ఉపయోగిస్తే పిల్లలు కూడా వారి బాటలోనే నడుస్తారు. కావున ఇంట్లోకి పర్యావరణ హిత రంగులనే తీసుకురండి. వాటినే పిల్లలకు ఇవ్వండి. వాటివల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. శుభ్రం చేయడం కూడా సులువే.
నీటి వినియోగం: పర్యావరణాన్ని కాపాడాలనే స్పృహ పిల్లలకు కూడా నేర్పాలి. సంతోషాల పేరిట ఎక్కువ నీటిని వినియోగించడం మంచిది కాదు. అందుకే ఒంటిని శుభ్రం చేసుకునేప్పుడు ఎక్కువ నీళ్లు పారబోయకూడదని చెప్పాలి.
ఆయిలింగ్: హోలీ ఆడేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు పిల్లల శరీరానికి, ముఖానికి, జుట్టుకు కొబ్బరి నూనె రాయాలి. ఇది వాటర్ ప్రూఫ్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. దీనివల్ల రంగులు ఎక్కువగా చర్మానికి అంటుకోవు.
పెంపుడు జంతువులతో వద్దు: హోలీ అనేది స్నేహితులు, సన్నిహితులతో ఆడుకునేది. అంతేగానీ ఈ ఆటలోకి పెంపుడు జంతువులను ఇన్వాల్వ్ చేయరాదు. కొందరు పిల్లలు పెంపుడు కుక్కలు, పిల్లులపై రంగులు చల్లి ఆనందిస్తారు. అది మంచిది కాదనే విషయం వారికి స్పష్టంగా చెప్పాలి.
పొడుగు చేతులున్న దుస్తులు మేలు: దుస్తులతో శరీరం మొత్తం కవర్ అయితే మేలు. అందుకే పొడుగు చేతులున్న (స్లీవ్స్) షర్టులు, టీ షర్టులు, టాప్స్ వేయాలి. లెగ్గింగ్స్ వేస్తే బెటర్.
సన్గ్లాసెస్: హోలీ రంగులు కళ్లకు హాని చేస్తాయి. అందుకే సన్గ్లాసెస్ ధరిస్తే కంట్లో రంగులు పడకుండా కాపాడతాయి. ఒకవేళ రంగులు కళ్లలో పడితే వెంటనే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
సబ్బులు: పిల్లల చర్మం మృదువుగా ఉంటుంది. హోలీ రంగులను శుభ్రం చేయాలని కఠినమైన సబ్బులను వాడరాదు. బేబీ షాంపూలు, సబ్బులనే వాడాలి.
పిల్లలకు బిస్కెట్లను పాలలో తడిపి ఇస్తున్నారా?
పిల్లలకు బిస్కెట్లు అంటే చాలాఇష్టం. పెద్దలు కూడా స్నాక్స్గా అప్పుడప్పుడు బిస్కెట్లను తీసుకుంటూ వుంటారు. అయితే బిస్కెట్ల ద్వారా ఆరోగ్యానికి మేలు జరగదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిస్కెట్ల తయారీలో అధిక ఉష్ణోగ్రతలో నూనె, డాల్డా వంటివి వేడి అవుతాయి. అలా వేడైనప్పుడు ఆమ్లాలు పుట్టుకొస్తాయని ఆ సంఖ్య బిస్కెట్లలో ఎంతమాత్రం వుంటాయే లెక్కచేయలేమని వైద్యులు చెప్తున్నారు.
ఈ ఆమ్లాలు శరీరంలో అధికంగా చేరడం ద్వారా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి హృద్రోగ వ్యాధులకు కారణమవుతాయి. బిస్కెట్లు ఎక్కువ కాలం నిల్వ వుండేందుకు.. ఇంకా చెడిపోకుండా వుండేందుకు ఉప్పు అధికంగా చేర్చుతారు. ఇలాంటి బిస్కెట్లను తీసుకుంటే హైబీపీ తప్పదు. హైబీపీ వున్నవారు అధికంగా బిస్కెట్లను తీసుకోకపోవడం ఉత్తమం. ఎక్కువ కాలం నిల్వ వుంచేందుకు, రుచి కోసం ఉపయోగించే రసాయనాలు ఆరోగ్యానికి మంచివి కావని వైద్యులు చెప్తున్నారు. ఇంకా బిస్కెట్లు మృదువుగా వుండేందుకు గ్లూటన్ చేర్చడం జరుగుతోంది.
ఇంకా ఉదయం, సాయంత్రం పూట పిల్లలకు బిస్కెట్లను ఇవ్వడం అలవాటు చేస్తే వారిలో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా స్నాక్స్ బాక్సుల్లో బిస్కెట్లను అస్సలు నింపకూడదు. బిస్కెట్లకు బదులు పండ్లను ఇవ్వడం చేస్తే పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లలకు ఓటమిని నేర్పించడం ఎలా..?
చాలామంది పిల్లలు ఎప్పుడూ విజయాలే వరించాలని కోరుకుంటారు.. అదేమి తప్పులేదు. కానీ అది ఆసాధ్యమనే అవగాహన మనకుండాలి. ఓటమి లేని విజయం వాళ్లకు ఏ జీవిత పాఠం నేర్పలేదని తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలకు ఓటమిని కూడా పరిచయం చేయాలి. అప్పుడే ఎలాంటి సమస్యలను ఎదుర్కోగల శక్తి వారిలో వస్తుంది. మరి అదెలా వారికి నేర్పించాలో చూద్దాం..
చదువు: తరగతిలో కాస్త వెనకపడిపోతుంటే వాళ్లని మిగతావారితో పోల్చి కించపరచొద్దు. మీ చిన్నారి ఏయే విషయాల్లో వెనకబడి ఉన్నాడో చూడాలి. వీలైతే కొత్త పద్ధతుల్లో ఆ సబ్జెక్టుపై పట్టుసాధించే అవకాశం ఉందేమో ప్రయత్నించాలి. ప్రతి సబ్జెక్టునీ వైవిధ్యంగా నేర్పిచే ఆన్లైన్ వీడియోలెన్నో ఇప్పుడు దొరుకుతున్నాయి.
ఆటలు: ఆటల్లో కూడా వెనకబడి ఉన్నారని బాధపడకండి. ఆటలో ఓటమి, విజయం రెండూ అత్యంత సహజమైన విషయమేనని చెప్పండి. క్రీడాస్పూర్తిని ఆస్వాదించడమే ఏ ఆటకైనా లక్ష్యమనే విషయమని అర్థం చేయించండి. మీ పాపో బాబో చేసే చిన్న ప్రయత్నాలని కూడా మెచ్చుకోండి.
కళలు: కళకీ అదే వర్తిస్తుంది. సంగీతం, నృత్యం, వాయిద్యం నేర్చుకోవడం.. ఇలా ఏదైనా సరే ఇవన్నీ జయాపజయాలకి అతీతమైన విషయమేనని వివరించండి. పక్కన ఉండే వాళ్లతో పోల్చుకోవడం కాదు.. ప్రపంచానికి మన ప్రత్యేకత చాటడం కళతోనే సాధ్యమవుతుందనే విషయం వాళ్లకి చెప్పగలగాలి.