స్టాక్హోం: 2018 సంవత్సరానికి గానూ నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది అమెరికా, జపాన్కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్ను పంచుకుంటున్నారు. జేమ్స్ పి అల్లిసన్(అమెరికా), తసుకు హోంజో(జపాన్)కు వైద్యరంగంలో నోబెల్ బహుమతి అందిస్తున్నట్లు స్టాక్హోం(స్వీడన్) లోని నోబెల్ అసెంబ్లీ ఈరోజు ప్రకటించింది.
క్యాన్సర్ చికిత్స కోసం వీరు చేసిన పరిశోధనలకు గానూ నోబెల్ బహుమతి ప్రకటించారు. క్యాన్సర్ కణాలపై పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయపడుతుందని వీరు తమ అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల(7,80,000 పౌండ్లు) నగదు బహుమతిని కూడా వీరు అందుకోనున్నారు.
వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్ బహుమతి అందిస్తారు. వీటితో పాటు శాంతి బహుమతి కూడా ఇస్తారు. అయితే కొన్ని లైంగిక ఆరోపణల కారణాల వల్ల ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ ఇవ్వట్లేదు. భౌతిక శాస్త్రంలో మంగళవారం, రసాయన శాస్త్రంలో బుధవారం పురస్కారాలు ప్రకటించనున్నారు. అక్టోబరు 5 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాల విజేతలను వెల్లడిస్తారు